యాచారం, మార్చి 23 : మండలంలో రోజురోజుకూ కరువు, కాటకాలు అలుముకుంటున్నాయి. పదేండ్లుగా చెరువులు, కుంటలు నిండి మత్తడి దుంకి రైతుల కళ్లల్లో ఆనందడోలికలు నింపాయి. బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండటంతో పంటలకు సరిపడా నీరు అందింది. ఎటూ చూసిన పచ్చదనమే కనపించేది. రాసులకొద్ది ధాన్యం దిగుబడి రావడంతో రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారు. కానీ నేడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ పాలన వస్తూనే కరువును మూటగట్టుకొచ్చింది. నాడు నీటితో కళకళలాడిన చెరువులు, నేడు చుక్కనీరు లేక వెలవెలబోతున్నాయి.
మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు చుక్కనీరు లేకుండా ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు నిత్యం అల్లాడుతున్నారు. పంటలకు సరిపడా నీరందక ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. దీంతో రైతన్నలు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో సాగునీటి ఎద్దడి రైతన్నలకు భారమైంది. గత ఐదారేండ్లతో పోలిస్తే ఈ యాసంగిలో పంటల సాగు తగ్గింది. ముఖ్యంగా వరి పంటసాగు చాలా తగ్గింది. ఒకప్పుడు ఆయకట్టు ప్రాంతాల్లో విస్తారంగా పంటలు పండిన భూములు నేడు సాగునీరు లేక ప్రస్తుతం ఆ భూములు బీడు భూములుగా మారుతున్నాయి.
రైతులు ఆహార పంటలను వదిలేసి వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్నారు. అందులోనూ నష్టా లు రావడంతో, కొంతమంది రైతులు ఉన్నకొద్దిపాటి నీటితో డ్రిప్పు పద్ధతితో కూరగాయల సాగును చేస్తున్నారు. బోరుబావులు ఎండి పోవడంతో కూరగాయలు సైతం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా కరెంటు ఎప్పు డు పోతుందో..ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొం ది. దీంతో అప్పుడే కరెంట్ కోతలు సైతం మొదలయ్యాయి. సాగునీరు, విద్యుత్ సమస్య రైతుల పాలిట శాపంగా మారింది.
మండలంలో 6 పెద్ద చెరువులున్నాయి. 86 చిన్న చెరువు, కుంటలున్నాయి. గతంలో ఇవన్ని నిండా నీటితో కళకళలాడాయి. నేడు చుక్కనీరు లేక వెలవెల బోతున్నాయి. మండలంలోని మేడిపల్లి గ్రామానికి సాలి చెరువు, ఎక్వ చెరువు, ఊర చెరువులు ఉన్నాయి, తక్కళ్లపల్లి చెన్నారెడ్డి చెరువు, నల్లవెల్లి చెరువులు చుక్కనీరు లేకుండా ఎండిపోగా చింతపట్ల లక్ష్మణ చెరువు, తాటిపర్తి బందం చెరువులో కొద్దిపాటి నీరు నిల్వ ఉంది. ఇక కుంటలన్ని ఎండిపోగా, గ్రామానికి చెందిన మురుగునీరు, వృథానీరు వెళ్లే కుంటలు మాత్రం నీటితో ఉన్నాయి. కేసీఆర్ పాలనలో మూడుమార్లు మత్తడిపోసి వాగులు పారిన చెరువులు, కాలువలు, కుంటలు ఎండిపోయాయి. రానున్న రోజుల్లో సరిపడా వర్షాలు కురియకపోతే సాగునీరుతో పాటు తాగునీరు ఎద్దడి తప్పదని ప్రజలు పేర్కొంటున్నారు.
మండలంలో క్రమక్రమంగా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. బోరుబావుల్లో ఉన్న నీరు పాతాళానికి పడిపోతుంది. అసలే ఎండలు దంచి కొడుతుండటంతో ఇప్పటికే కొన్ని బోరుబావులు ఆపుతూ పోయగా, మరికొన్ని పూర్తిగా వట్టిపోయాయి. నూతనంగా బోర్లు వేసిన ఫలితం లేకుండా పోతుంది. 500నుండి 1000 ఫీట్లలోతు వరకు వేసినా చుక్క నీరు రాకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు చేసేదేమీలేక ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు సాగుచేస్తున్నారు. మండలానికి సాగునీరు తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిండిప్రాజెక్ట్తో మండలానికి సాగునీరు సమస్య తీరనుందని రైతులు సంబుర పడ్డారు. డిండి నుంచి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ రిజర్వాయర్ నుంచి మంతన్గౌరెల్లి మీదుగా చౌదర్పల్లి వద్ద 4టీఎంసీ సామర్థ్ద్యం గల రిజర్వాయర్ను నిర్మించాలని గత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. గతంలో పైపులైను వేసే ప్రాంతాలను ఆయన ఇంజినీర్లతో కలిసి సర్వే చేయించారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే కరువు నేలపై సిరులు కురిసినట్లేనని రైతులు భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో డిండి జలాల నీరు రావడంపై రైతుల ఆశలు ఆవిరైనట్లు భావిస్తున్నారు.
సాగునీరు లేక క్రమంగా పంటలు పూర్తిగా ఎండు ముఖం పట్టాయి. వర్షాలను నమ్ముకొని పంటలు సాగుచేసిన రైతులకు నిరాశే మిగిలింది. ఎండలు దంచి కొట్టడంతో పంటలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురువకపోతే వరి, కూరగాయలు, ఆకుకూరల పంటలు మొత్తం దెబ్బతింటాయి. ఇప్పటికే రైతులు సగం ఆశలు కోల్పోయారు. సరిపడా వర్షాలు కురియకపోతే పంటలు చేతికిరాక రైతులు తీవ్రంగా నష్టపోతారు. కరెంటు కోతలు లేకుండా చూడాలి. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– సాలయ్య, మేడిపల్లి