షాబాద్, ఏప్రిల్ 16 : భూగర్భజలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీరు ఇంకిపోతున్నది. దీంతో చేతికందే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా, వ్యవసాయ బావుల్లో పూడికతీత పనులు చేస్తున్నా, లాభం లేకుండా పోతున్నది. కొద్ది రోజుల్లోనే చేతికొస్తుందనుకున్న దశలో నీళ్లు సరిపోక పంటలు ఎండి-పోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పైరు కండ్ల ముందే ఎండిపోతున్నా అన్నదాతలు ఏమీ చేయలేకపోతున్నారు.
ఇందుకు సాక్ష్యం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో చేతికొచ్చిన వరి పంట ఎండిపోతున్న దృశ్యాలే.. ఎండిన పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇది ఒక్క షాబాద్ మండలంలోనే కాదు.. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది.
ఎండుతున్న పంటలతో రైతుల కష్టాలు..
యాసంగి సీజన్లో బోరు బావుల కింద సాగు చేసిన పంటలు నీళ్లు పారకపోవడంతో ఎండిపోతున్నాయి. ప్రధానంగా రైతులు వరి పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. గత ఐదేండ్లుగా వానకాలం, ఎండాకాలం వరి పంటను సాగు చేసుకుంటూ వస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు మరమ్మతులు చేయడంతో భారీ వర్షాలకు చెరువులు నిండి అలుగు పారి బోరు బావుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీనికితోడు 24 గంటల విద్యుత్తు, అదునుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో అన్నదాతలకు ఇబ్బందులు లేకుండేవి. కానీ అందుకు విరుద్ధంగా గతేడాది వర్షాలు సరిగ్గా కురువకపోవడంతోపాటు భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీనికి తోడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ఉన్న కొద్దిపాటి పంట కూడా నీళ్లు పారకపోవడంతో ఎండుముఖం పడుతున్నది.
పశువుల మేతగా వరి పంట
షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామ రైతు పోనమోని కృష్ణయ్య రెండెకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. దాని కోసం రూ.50వేల వరకు ఖర్చు చేశాడు. మార్చి వరకు పంటకు నీరు బాగానే అందింది. ఇంకో నెల రోజులైతే పంట చేతికొచ్చేది. కానీ నీరు అందకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. మరో యువ రైతు పోనమోని జైపాల్కు చెందిన రెండెకరాల పొలం ఎండడంతో దిక్కుతోచని స్థితిలో వరిపంటను పాడి ఆవులకు పంటను మేపుతున్నాడు.
వరిపంటను పశువుల మేతగా వేస్తున్నా..
నేను యాసంగి సీజన్లో రెండు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. మార్చి వరకు బాగానే నీరు పారింది. పంట చేతికొస్తదని అనుకున్నా. చివరి దశలో బోరు నీరు పోయడంలేదు. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా ఎండింది. పంట కోసం రూ.50వేల వరకు ఖర్చు చేశాను. ఎండిపోయిన వరి పంటను పాడి ఆవులకు మేపుతున్నా. ప్రభుత్వం ఆదుకోవాలి.
– పి. జైపాల్, యువ రైతు, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
రైతులకు నష్టపరిహారం అందించాలి
బోర్లలో నీరు లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. రెండు ఎకరాల్లో వరి పంట వేశా. ఇంకా నెల రోజులైతే పంట చేతికొచ్చేది. నీళ్లు అందకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. అప్పులు చేసి పంటలు సాగు చేశాను. కండ్ల ఎండిన పంటను చూస్తే కన్నీరు వస్తున్నది. ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వాలి.
– పోనమోని కృష్ణయ్య, రైతు, కుమ్మరిగూడ, షాబాద్ మండలం