వికారాబాద్, జూలై 3 : ఆషాఢ మాసం అనంతపద్మనాభస్వామి చిన్న జాతర ముగింపు సందర్భంగా సోమవారం ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. స్వామివారి పల్లకీని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మోసి భక్తిని చాటుకున్నారు. జాతర సందర్భంగా ఆలయ ఆరవణలో ధ్వజస్తంభంపై పెరుగు కుండను పగులగొట్టి పెరుగు బసంతం చేశారు. పెరుగు బసంతాన్ని ఎమ్మెల్యే ఆనంద్ దంపతులు తిలకించారు. చిన్నారులు కోలాటాలు ఆడటంతో సందడి వాతావరణం నెలకొంది. వికారాబాద్ ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, ఆలయ ఫౌండర్ పద్మనాభం, ఆలయ ఈవో నరేందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.