ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సరిపడా గన్నీ బ్యాగులను సైతం అందుబాటులో ఉంచారు. 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 5,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రైతుల ఖాతాల్లో రూ.67 లక్షల నగదును జమ చేశారు.
వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లావ్యాప్తంగా 122 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు 56 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం 35 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ధాన్యం ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ.2203, సాధారణ రకం రూ.2183గా మద్దతు ధరను నిర్ణయించింది. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులను జమ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
– రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): ‘జిల్లాలో వానకాలం పంట పుష్కలంగా పండింది. పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తోంది. 87వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉండగా.. ఆ మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు 5,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.67లక్షల వరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. సరిపడా గన్నీ బ్యాగులను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు.’
రైతులకు రందీ లేకుండా..
గతానికి భిన్నంగా జిల్లాలో నీటిపారుదల పెరిగిన నేపథ్యంలో ఏటేటా సాగు విస్తీర్ణంతోపాటు ధాన్యం దిగుబడులు పెరుగుతూ వస్తున్నాయి. పంటలు అమ్ముకునేందుకు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది జిల్లా యంత్రాంగం. వడ్ల కొనుగోళ్ల కోసం జిల్లాలో 33 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడు కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో, 20 కేంద్రాలను పీఏసీఎస్ల ఆధ్వర్యంలో, మరో 10 కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కొనుగోళ్లు జరుపుతున్నారు. సరిపడ గన్నీ బ్యాగులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచారు. చాలా చోట్ల వరి కోతలు పూర్తవడంతో ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తున్నది. షాద్ నగర్ ప్రాంతంలో కోతలు ఆలస్యం కావడంతో ధాన్యం రావడం ఆలస్యం కానున్నది. ప్రస్తుతం 20 కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 943 మంది రైతుల నుంచి 5,098 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్నటికే రూ.67లక్షలను రైతులకు చెల్లించారు.
సజావుగా కొనుగోళ్లు జరిగేలా..
మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హమాలీలు, లారీల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు ఎదురవుతున్నాయో గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. లోడింగ్, అన్లోడింగ్..గన్నీ బ్యాగులు, రైతులకు డబ్బుల చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లాస్థాయిలో ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే వానకాలం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. కొనుగోళ్లు జరిపిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ డీఎం విజయలక్ష్మి తెలిపారు.