ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24: ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడేవారు. కొందరు మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోగా .. మరికొందరు ఇతర పనులు చేసుకునేవారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టింది. దీం తో చెరువులు కాలంతో సం బంధం లేకుండా నీటితో కళకళలాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకున్నది.
మత్య్సకారులకు ఉపా ధి కల్పించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 800 చెరువులు, కుంటల్లో 1.70 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు అధికారు లు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పెద్ద చెరువులైన ఇబ్రహీంపట్నం, రావిర్యాల, తలకొండపల్లి, వెల్జాల్, ఆమనగల్లు, షాబాద్, యాచారం, మంచా ల, తుర్కయాంజాల్ మాసాబ్చెరువుతోపాటు ఇతర చిన్న, పెద్ద సుమారు 800 చెరువులను మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో చేప పిల్లలను పెంచేందుకు అనువైన చెరువులను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో చేపపిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్న రోజే జిల్లాలోని చెరువుల్లోకి చేపపిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు అవసరమైన చేప పిల్లలను చేపల పెంపకం కేంద్రాల్లో సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది వర్షాలు ముందుగానే కురువ డంతోపాటు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదై చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. గతేడాది జిల్లాలో 1.60 కోట్ల చేపపిల్లలను మాత్రమే ఆయా చెరువుల్లో పెంచగా..ఈ ఏడా ది మరో 10 లక్షల చేపపిల్లలను అదనంగా పెంచాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది మత్స్యకారుల డిమాండ్ మేరకు చేప పిల్లలను ఇవ్వడంతో ఈ ఏడాది చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మత్స్యకారులకు కాసుల పంట కురిసింది. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురువడంతో పెద్ద మొత్తంలో చేపలను పెంచే కార్యక్రమానికి మత్స్యశాఖ సిద్ధమైనది. దీంతో మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లాలో 121 సొసైటీలు..
జిల్లాలో 121 మత్స్యకార సొసైటీలున్నాయి. ఆ సొసైటీల డిమాండ్ మేరకు జిల్లాలోని చెరువుల్లో వదిలేందుకు చేప పిల్లలను పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. గతేడాది కంటే అదనంగా 10 లక్షల చేపపిల్లలను ఈ ఏడాది ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సొసైటీల్లోని సభ్యులకు చేపల వేటపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని 800 చెరువుల్లో..
రంగారెడ్డి జిల్లాలో సుమారు 800 చెరువుల్లో 1.70 కోట్ల చేప పిల్లలను పెంచాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన రోజే జిల్లా లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఇందుకు అవసరమైన చేపపిల్లలు కూడా సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో గుర్తింపు పొందిన 121 సొసైటీల ద్వారా ఈ చేప పిల్లలను మత్స్యకారులకు అందజేస్తాం.
– సుకీర్తి, రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి