షాబాద్, సెప్టెంబర్ 9 : తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి విద్యాశాఖ రెండు రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలోని ఉద్యోగార్థులు కొలువుకొట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో 196 పోస్టుల భర్తీ..
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఆమనగల్లు, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో ఖాళీగా ఉన్న 196 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఎస్జీటీ-48, స్కూల్ అసిస్టెంట్లు-117, భాషా పండితులు-25, పీఈటీలు-06 ఉన్నాయి. బీఈడీ, డీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించిన 18-44 ఏండ్ల లోపు అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా రూ.వెయ్యి దరఖాస్తు ఫీజు చెల్లించి సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 21వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 20 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)రాత పరీక్ష నిర్వహించనున్నది. <https://schooledu.telangana.gov.in> వెబ్సైట్లో సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది.