తాండూరు, ఏప్రిల్ 10 : తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన వేగంగా జరుగుతున్నది. అర్హులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నిష్పక్షపాతంగా పేదలకు ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. అభ్యంతరాలు వస్తే అత్యంత పారదర్శకంగా లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
త్వరలో ముహూర్తం ఖరారు చేయనున్నట్లు తెలిసింది. పేదల కోసం సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు సిద్ధం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని నిజమైన పేదలకు మాత్రమే ఇల్లు వచ్చేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.