మొయినాబాద్, జనవరి 4 : ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలు తెప్పించుకుంది. ఏయే బడులకు ఎన్ని నిధులు కేటాయించాలనే ప్రణాళికలు రూపొందించి పాఠశాలలను ఎంపిక చేసింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభు త్వం మొయినాబాద్లో 18 పాఠశాలలను మన ఊరు.. మన బడిలో భాగంగా ఎంపిక చేసింది. వీటి లో రెండు పాఠశాలలను మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే ఆ పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి.
మండలంలో 18 పాఠశాలలు ఎంపిక
ప్రైవేటుకు దీటుగా పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మన ఊరు.. మన బడిలో భాగంగా మండలంలో 18 పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్నగర్, అజీజ్నగర్, బాకారం, తోలుకట్టా, చిన్నమంగళారం, కనకమామిడిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అలాగే మొయినాబాద్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మేడిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను మన ఊరు.. మన బడి కింద ఎంపిక చేసింది. ఈ పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఆయా పాఠశాలల్లో ఏయే సౌకర్యాలు అవసరం ఉన్నాయో ముందే సంబంధిత అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. అవసరం ఉన్న సౌకర్యాల మేరకు మన ఊరు.. మన బడి కింద నిధులు ఇవ్వడానికి ప్రణాళికలు సైతం సిద్ధం చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధ్ది చెందితే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు.
మోడల్ పాఠశాలలుగా..
అజీజ్నగర్లోని ప్రాథమిక పాఠశాల, పెద్దమంగళారంలోని ప్రాథమిక పాఠశాలను మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో పనులు జరుగుతున్నాయి. అజీజ్నగర్లో పాఠశాల భవనం కురవడంతో వాటి మీద ఫ్లోరింగ్ చేయించారు. పెద్దమంగళారంలోని ప్రాథమిక పాఠశాలలో పనులు కొనసాగుతున్నాయి. అజీజ్నగర్ పాఠశాలలో పనులు జోరుగా సాగుతున్నాయి.
దశల వారీగా పాఠశాలల అభివృద్ధి
ప్రైవేట్కు దీటుగా పాఠశాలల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మండలంలో రెండు పాఠశాలలను మోడల్గా తీసుకుని అభివృద్ధి చేస్తున్నది. అభివృద్ధ్ది పనులు జరుగుతున్నాయి. విద్యార్థులు పాఠశాలలో ప్రవేశించగానే ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాతావరణంలా ఉండడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. దశల వారీగా ఎంపికైన పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి.
– కె.వెంకటయ్య, మండల విద్యాధికారి, మొయినాబాద్
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనులు
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. పాఠశాల భవనం మీద ఫ్ల్లోరింగ్ వేశాం. కరెంట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం గోడలకు రంగులు వేస్తున్నారు. రెండు రోజుల్లో పాఠశాలకు రంగులు వేసే పనులు పూర్తి చేస్తారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో జరుగుతున్న ప్రగతి పనుల వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నాం.
– నర్సింహానాయక్, హెచ్ఎం, ప్రభుత్వ పాఠశాల, అజీజ్నగర్