రంగారెడ్డి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి పేదరికంలో ఉన్నవారిని ఎంపిక చేస్తూ మినీ పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తున్నది. ప్రధానంగా నిత్యావసర వస్తువుల తయారీ, ఉత్పత్తులు, వ్యాపారాలు, వివిధ సేవలకు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించడంతోపాటు యూనిట్కు రూ.75 వేల నుంచి 20లక్షల దాకా రుణాలిప్పించేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నది. ఔత్సాహిక లబ్ధిదారులకు లోన్లు ఇప్పించడమేకాదు, యూనిట్ల స్థాపనకు అవసరమైన వసతులు కల్పిస్తున్నది.
5,850 సంఘాలకు రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లాలో 5,850 సంఘాలకు వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నది. 4,800 దరఖాస్తులకు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తి అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మహిళా లోకం హర్షిస్తున్నది. పలు సంఘాల ఆధ్వర్యంలో యూనిట్లను నిర్వహిస్తున్నవారు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారులు రెండు లక్షల పదివేలకు పైగానే ఉన్నారు.
రూ.800 కోట్ల రుణాలు అందించేందుకు..
రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామాలుండగా.. 780 గ్రామ సంఘాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాల్లోని పేదింటి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే పలు రకాల రుణాలను అందిస్తున్నది. ఆ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, ఇతర దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వినియోగిస్తుండటంతో సరికొత్త ఆలోచనలు చేసింది. రోజువారీ ఆదాయ మార్గాలు చూపుతూ.. మరికొందరికి ఉపాధి కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు రెండేండ్లుగా మినీ ఇండస్ట్రీస్ స్థాపించే మహిళలకు పెద్దమొత్తంలో రుణాలను అందిస్తున్నది. ఎంటర్ప్రైజెస్, నాన్ ఫార్మ్కు సంబంధించి ఇప్పటికే 165 వ్యాపారాలు కొనసాగుతున్నాయి. కొత్తగా వ్యాపారాలు నిర్వహించుకునేవారి కోసం రుణాలందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా ఒక్కో యూనిట్కు గరిష్టంగా 20 లక్షల దాకా రుణ సదుపాయం కల్పించేలా బ్యాంకర్లతో ఒప్పందం చేసుకున్నది. లబ్ధిదారులు ఔత్సాహిక యూనిట్లను స్థాపించుకునేందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల నుంచి ఎంపిక చేసిన 4,800 మందికి వివిధ బ్యాంకుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్ల రుణాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. కేవలం 10% కంట్రిబ్యూషన్ చెల్లిస్తే మిగతా 90% బ్యాంకుల నుంచి రుణ రూపంలో తీసుకొని, ఎంపిక చేసిన మహిళా సభ్యురాలు పరిశ్రమ ఏర్పాటు చేసుకునేలా సహకరిస్తున్నది. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం మూడేండకల పాటు క్రమం తప్పకుండా చెల్లించిన అనంతరం, 35% సబ్సిడీ అందించనున్నది.
ఆదాయం వచ్చే పరిశ్రమలపై అవగాహన
ఈ పథకం కింద గతేడాది జిల్లాలోని 2,882 యూనిట్లు వ్యాపారాలు ప్రారంభించాయి. జిల్లాలోని అన్ని యూనిట్లకు రూ.695 కోట్ల రుణాలను విడుదల చేశారు. స్వయం సహాయక సంఘాలకు అందజేసే రుణ విధానంలో మార్పులు, చేర్పులు జరిగిన నేపథ్యంలో ఇక నుంచి రుణ సాయం పొందేవారు ఆదాయం వచ్చే పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేసుకునేలా అధికారులు సంఘాలకు అవగాహన కల్పిస్తున్నారు. తొలి విడుత రుణం తీసుకున్న సంఘాల సభ్యులు సక్రమంగా రుణ పైకం చెల్లిస్తే, రెండో విడుతలో వారికి రుణం పొందేలా వెసులుబాటు కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధిత బ్యాంకులను ఆదేశించింది. దీంతో క్రమం తప్పకుండా రుణ పైకం చెల్లిస్తున్న వారికి బ్యాంకర్లే పిలిచి కొత్త రుణాలు మంజూరు చేస్తుండటం కూడా మహిళా సంఘాలకు కలిసి వస్తున్నది.
నిత్యావసర వస్తువుల తయారీకి ప్రాధాన్యం
ఎంపికైన మహిళా సంఘాల సభ్యుల వివరాలు, వారు ప్రారంభించబోయే మినీ ఇండస్ట్రీల వివరాలతో కూడిన జాబితాలు ఇప్పటికే జిల్లాలోని వివిధ బ్యాంకులకు చేరాయి. త్వరలోనే వీరికి రుణాలు కూడా విడుదల చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ యంత్రాంగం కృషి చేస్తున్నది. నిత్యావసర వస్తువుల యూనిట్లు ఏర్పాటు చేసుకుని నిరంతర ఆదాయం పొం దేలా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఎంపిక చేసిన మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా పిండిగిర్నీలు, ఆహార పదార్ధాల తయారీ యూనిట్లయిన అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం పొడి, నూనె తయారీ, గానుగ నూనె, పచ్చళ్లు, అటుకులు, పిండి వంటల తయారీ పరిశ్రమలు స్థాపించుకునేలా సూచిస్తుండగా.. ఎంపికైన యూనిట్లలో దాదాపు 90% మంది వీటినే ఎంచుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేసుకునే వారికి కూడా రుణాలు ఇస్తున్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇదో మంచి అవకాశం
జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, ఎంటర్ప్రైజెస్ పథకంలో ఎంపికై రుణాలు పొందే మహిళలు, చిన్న పరిశ్రమల యజమానులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా నిత్య ఆదాయ మార్గాలు చూపే యూనిట్లను ఎంపిక చేసుకుని, లబ్ధి పొందవచ్చు. ప్రధానంగా ఆహార పదార్థాల పరిశ్రమలు స్థాపించుకుని, నిర్వహిస్తే అత్యధిక లాభాలు పొందవచ్చు. రుణ గ్రహీతలు క్రమం తప్పకుండా చెల్లిస్తే 35% మేర సబ్సిడీ కూడా పొందేందుకు అర్హులు. డీఆర్డీఏ (సెర్ప్) ఆధ్వర్యంలో ఇప్పటికే రూ.800 కోట్ల రుణాలు ఆయా యూనిట్లకు అందాయి. ఈ పరిశ్రమల స్థాపన ద్వారా ఆయా సంఘాల సభ్యులు ఉపాధి పొందడంతో పాటు మరి కొద్ది మంది తోటి మహిళలకు ఉపాధి కల్పించే అవకాశాలుంటాయి.
– ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి