తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
చేపట్టిన హరితహారం కార్యక్రమంతో సర్కారు బడులు పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఏపుగా పెరిగిన చెట్లతో నందనవనాన్ని తలపిస్తోంది. హరితహారం మెదటి, రెండు విడతల్లో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి నీడనిస్తున్నాయి. పదుల సంఖ్యలో నాటిన వివిధ రకాల మొక్కలతో చిన్నపాటి అడవిని తలపిస్తోంది. పాఠశాల ప్రాంగణంలోని చెట్లతో పాటు బడి ముందున్న చెట్లు అటుగా వెళ్లే వారికి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. పచ్చని వాతావరణంలో తక్కళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల చుట్టుపక్కల గ్రామాల పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.
– యాచారం, జూన్ 23
తక్కళ్లపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉంది. బడిలో స్వచ్ఛతతో పాటు పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతుండటం, సౌకర్యాలు మెరుగుపడటంతో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లు తరగతి గదులకు పందిరి వేసినట్లు ఉండటంతో విద్యార్థులకు స్వచ్ఛమైన గాలి అందుతున్నది. పాఠశాల ఆవరణలోని గ్రౌండ్లో విద్యార్థులు నిత్యం అనేక రకాల ఆటలు ఆడుతూ తమ ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంతో సర్కారు బడుల్లో సౌకర్యాలు మెరుగయ్యాయి. ఈ విద్యా సంవత్సరం తక్కళ్లపల్లి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రతి బడిలో మొక్కలు నాటాలి
హరితహారంలో భాగంగా ఈ ఏడాది మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలి. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే ఎలాంటి ఒత్తిడి లేకుండా చదువులో రాణిస్తారు. ఉపాధ్యాయులు సైతం విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నాటిన ప్రతిమొక్కనూ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు బడులు కార్పొరేట్ను తలపిస్తున్నాయి.
– విజయలక్ష్మి ఎంపీడీఓ, యాచారం