రంగారెడ్డి, జనవరి 19(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికల నగారా మోగింది. పాఠశాల యాజమాన్య కమిటీ(ఎస్ఎంసీ)లకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేడు నోటిఫికేషన్ రానుండగా ఈ నెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో యాజమాన్య కమిటీలు కీలక భూమికను పోషిస్తున్నాయి. వీటికి చివరిసారిగా 2019లో ఎన్నికలు జరిగాయి. రెండేండ్ల కాలపరిమితి ఉండే ఎస్ఎంసీలు కోవిడ్ కారణంగా పాత కమిటీలే ఇప్పటిదాకా కొనసాగాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పాఠశాలల్లో ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం శనివారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షుల జాబితాను నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తారు. 22, 23వ తేదీల్లో తల్లిదండ్రుల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు.
24వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రుల తుది జాబితాను నోటీస్ బోర్డుపై ప్రదర్శిస్తారు. 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఎంసీ సభ్యులను ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 1.30కు ఎన్నుకున్న సభ్యుల్లో నుంచి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకుంటారు. అనంతరం మొదటి ఎస్ఎంసీ సమావేశం నిర్వహిస్తారు.
ఎస్ఎంసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే పాఠశాలలో చదివే విద్యార్థి తల్లిదండ్రి లేదా సంరక్షుడై ఉండాలి. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లిదండ్రులనే సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ముగ్గురు చొప్పున 15 మందిని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 24 మందిని, ఉన్నత పాఠశాలల్లో(6 నుంచి 8 తరగతులకు) 9 మందిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఎన్నుకునే సభ్యుల్లో 2/3వ వంతు మహిళలు ఉండాలి.
ఎస్ఎంసీ కమిటీకి హెచ్ఎం మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాఠశాలలోని ఉపాధ్యాయుడు, వార్డు సభ్యుడు, అంగన్వాడీ టీచర్, మహిళా ఏఎన్ఎం, మహిళా సంఘం అధ్యక్షురాలు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులు ఉంటారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎంసీ ఎన్నికను నిర్వహిస్తారు. ఎన్నికకు విద్యార్థుల తల్లిదండ్రులు కనీసం 50 శాతం హాజరు కావాలి. దీనినే కోరంగా పరిగణిస్తారు. హాజరైనవారు చేతులెత్తే పద్ధ్దతి, నోటి మాట ద్వారా సభ్యులను ఎన్నుకుంటారు. అవసరమనుకుంటే రహస్య బ్యాలెట్ను నిర్వహిస్తారు. ఎన్నికైన ఎస్ఎంసీ ప్రతి రెండు నెలలకు ఒకసారైనా సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది.
ఎన్నికైన ఎస్ఎంసీలు పాఠశాల కార్యకలాపాలను, విద్యార్థుల ప్రగతిని సమీక్షించాలి. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి, విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలి. బడీడు పిల్లలను బడిలో చేర్పించడానికి కృషి చేయాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును పరిశీలిస్తూ సమీక్షించాలి. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం తదితర వాటి పంపిణీని పర్యవేక్షించాలి. పాఠశాలలకు మంజూరయ్యే నిధులు ఎస్ఎంసీ ఖాతాలలో జమ అవుతాయి. వాటిని సక్రమంగా ఖర్చు చేయాలి. పాఠశాల అభివృద్ధికి ఎస్ఎంసీలు కృషి చేయాలి.
రంగారెడ్డి జిల్లాలో 881 ప్రాథమిక పాఠశాలలు, 181 ప్రాథమికోన్నత పాఠశాలలు, 247 ఉన్నత పాఠశాలలు, 20 కేజీబీవీలు, 9 ఆదర్శ పాఠశాలలు కలిపి మొత్తం 1,383 పాఠశాలల్లో ఎస్ఎంసీ కమిటీల ఎన్నిక చేపట్టనున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 771, ప్రాథమికోన్నత పాఠశాలలు 116, ఉన్నత పాఠశాలలు 176, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు 18, మాడల్ స్కూళ్లు 9, ఏయిడెడ్ పాఠశాలలు 11, టీఎస్ఆర్ఈఐఎస్ 2, యూఆర్ఎస్ 1 ఉన్నాయి.
ఎస్ఎంసీ ఎన్నికల కోసం విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. శనివారం నోటిఫికేషన్ జారీ కానున్నది. ఈనెల 29న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల ఆఫీసర్లుగా పాఠశాలల హెచ్ఎంలే ఉంటారు. కాబట్టి అప్పటివరకు హెచ్ఎంలకు సెలవులను రద్దు చేశాం.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాం. ఎన్నికల నిర్వహణపై జిల్లాలోని హెచ్ఎంలతో సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు అందించాం. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చాం. జిల్లాలో 1064 ప్రభుత్వ పాఠశాలలు, 18 కేజీబీవీలు, 9 మాడల్, 11 ఎయిడెడ్, ఒకటి యూఆర్ఎస్, రెండు టీఎస్ఆర్ఈఐఎస్ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఎన్నికలు నిర్వహిస్తాం.