అభివృద్ధిలో మేటిగా నిలుస్తున్న ఇబ్రహీంపట్నంలో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఇబ్రహీంపట్నంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి రూ.37.50కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కృషి చేస్తున్నారు. త్వరలోనే వంద పడకల దవాఖాన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే రెండు ఏరియా దవాఖానలు ఉండగా, ఇబ్రహీంపట్నంలో నిర్మించే మూడో ఏరియా దవాఖానతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఈ దవాఖాన నిర్మాణం పూర్తైతే ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలతో పాటు మాడ్గుల, మర్రిగూడ తదితర మండలాలకు చెందిన ప్రజలకు మేలు జరుగనున్నది.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 26 : పేదలందరికీ సర్కారు వైద్యం మరింత అందుబాటులోకి తీసుకువచ్చి సూపర్స్పెషాలిటీ వైద్యసదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఇబ్రహీంపట్నంలో వందపడకల ఏరియా దవాఖానను ఏర్పాటు చేసేందుకు రూ.37.50కోట్లను మంజూరుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఇబ్రహీంపట్నం పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కోరిక మేరకు ఆయన ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానను సందర్శించారు. ఇందులో వందపడకల దవాఖాన ఏర్పాటుకు నిధులు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వెంటనే అక్కడే ఉన్న వైద్యవిధాన పరిషత్ కార్యదర్శిని పిలిచి వందపడకల హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఈ దవాఖాన నిర్మాణానికి రామోజీ ఫౌండేషన్ రూ.4కోట్లు ఇవ్వటానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో కలిపి మొత్తం రూ.37.50కోట్లను కేటాయించటానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఔట్పేషెంట్ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో మూడు అంతస్తుల భవనాన్ని నిర్మించనున్నారు.
ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు డయాలసిస్ చేయించుకోవటం కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారికి ఈ కేంద్రం ఎంతో ఉపయోగం చేకూరునున్నది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీలున్నాయి. దీంతో రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ పరిస్థితిలో ఇబ్రహీంపట్నంలో వందపడకల దవాఖానను ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్యశాఖమంత్రి హరీశ్రావులను కోరారు. ఆయన అభ్యర్థన మేరకు వందపడకల దవాఖాన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
వందపడకల ఆస్పత్రి ప్రారంభిస్తే ఐసీయూ ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక హంగులతో మూడు అంతస్తుల భవనం నిర్మించనున్నారు. మౌలిక సౌకర్యాలు కల్పించి అన్ని రకాల రోగాలకు సంబంధించిన వైద్యులు అందుబాటులో ఉంటారు.
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ప్రభుత్వం త్వరలో వందపడకల దవాఖానను ప్రారంభించటం ఎంతో సంతోషకరం. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న చిరకాల వాంఛ అయిన ఆస్పత్రి నిర్మాణంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ…కార్పొరేట్కు దీటుగా వైద్యసౌకర్యాలు కల్పిస్తుండటంతో ప్రజలలకు వైద్యం మరింత చేరువ కానుంది.
ఇబ్రహీంపట్నంలో వందపడకల దవాఖాన ఏర్పాటుకు ప్రభుత్వం రూ.37.50కోట్లు కేటాయించింది. ఈ నిధులతో త్వరలోనే ఇబ్రహీంపట్నంలో హాస్పిటల్ను నిర్మిస్తాం. దీంతో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలతో పాటు మాడ్గుల, మర్రిగూడ తదితర మండలాలకు చెందిన రోగులకు మరింత వైద్య సేవలు చేరువ కానున్నాయి.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం