విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ఇప్పటికే మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతుండగా.. ప్రస్తుతం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ‘రీడింగ్ కార్నర్స్’ పేరిట గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. తొలివిడుతలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 148 ప్రైమరీ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 154 ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్కార్నర్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో గ్రంథాలయానికీ 240 చొప్పున పుస్తకాలను ప్రభుత్వం అందజేయనున్నది. వీటికి తోడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా విజ్ఞానాన్ని పెంచే పుస్తకాలను అందించనున్నాయి. ‘రీడింగ్ కార్నర్స్’లో బుక్ ర్యాక్స్, బీరువాలు, రీడింగ్ టేబుళ్లు, పిన్ డిస్ప్లే బోర్డులు, కూర్చునేందుకు కార్పెట్స్, పుస్తకాల నిర్వహణకు రిజిస్టర్ వంటి వసతులను కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని 34 పాఠశాలలకు బుక్ ర్యాక్స్, పుస్తకాలు చేరుకున్నాయి.
షాబాద్, మే 4 : విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు గ్రంథాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వివిధ అంశాల్లో విజ్ఞానం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇంగ్లిష్, తెలుగు, గణిత శాస్త్రంలో పట్టు సాధించేలా అవగాహన కల్పిస్తున్నది. రాష్ట్రంలో సుమారు 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తుండగా, ఇందుకనుగుణంగా రంగారెడ్డిజిల్లాలో 148 ప్రైమరీ స్కూళ్లలో రీడింగ్ కార్నర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కమిటీలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఒక్కో గ్రంథాలయానికి 240 పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తుంది. వీటికి తోడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞాన విషయాలపై బుక్కులు ఇస్తుండడంతో విద్యార్థుల మేధాశక్తికి అవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
రంగారెడ్డిజిల్లాలో 148 స్కూళ్లలో రీడింగ్ కార్నర్ల ఏర్పాటు
సర్కార్ స్కూళ్లలోనూ కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నది. రంగారెడ్డిజిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, ఆమనగల్లు, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఆయా గ్రామాల్లో మొత్తం 148 ప్రైమరీ స్కూళ్లలో రీడింగ్ కార్నర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గణితశాస్త్రం సామర్థ్యాలు, తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు సాధించేలా తొలిమెట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నది. దీనికి తోడు మన ఊరు-మన బడిలో అన్ని వసతులు కల్పిస్తున్నది. అన్ని అంశాల్లో విద్యార్థులు పట్టు సాధించేలా లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నది.
ఫర్నిచర్, పుస్తకాలతో రీడింగ్ కార్నర్
గ్రంథాలయాల్లో పుస్తకాలతోపాటు ఫర్నిచర్ సమకూర్చి రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రంథాలయానికి 240 పుస్తకాలతోపాటు 7 పెద్ద పోస్టర్లు, 12 పెద్ద పుస్తకాలు, పాఠశాలల్లో ప్రత్యేకంగా ఓ గది, అందులో బుక్ రాక్లు, బీరువాలు, రీడింగ్ టేబుల్, పిన్ డిస్ప్లే బోర్డు, కూర్చునేందుకు కార్పెట్, పుస్తకాల నిర్వహణకు ఓ రిజిస్టర్ మెయింటేన్ చేసేలా ప్రణాళికలు రూపొందించింది. చదువుతోపాటు విజ్ఞానం పెరిగేలా ఈ కార్నర్స్ ఎంతో తోడ్పాటు అందిస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. క్రమశిక్షణతో పఠనం చేయించేలా కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న గ్రంథాలయాల నిర్వహణ కోసం కమిటీలు వేస్తున్నారు. రీడింగ్ కార్నర్స్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా కమిటీ ప్రత్యేక కృషి చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో పోటీతత్వం, ఆసక్తి పెంచేందుకు ఈ గ్రంథాలయాలు వేదికగా నిలువబోతున్నాయి.
ప్రభుత్వం వికారాబాద్ జిల్లా పరిధిలోని 154 ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఒక ర్యాక్, 240 పుస్తకాలు కేటాయించనున్నారు. ఇందులో రూమ్ టు రీడ్ పుస్తకాలు 120, నేషనల్ బుక్ ట్రస్టు నుంచి 120 పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పఠనాశక్తిని పెంచేందుకే ఈ రీడింగ్ కార్నర్స్ ప్రధాన ఉద్దేశం. ఇందులో అత్యధికంగా కథల పుస్తకాలు, డ్రాయింగ్ బుక్స్ అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు ధారాళంగా చదివేలా తయారు చేయడం కోసం ఈ రీడింగ్ కార్నర్స్ ఉపయోగపడనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 34 పాఠశాలలకు ర్యాక్స్, పుస్తకాలు కూడా వచ్చాయి. వాటిని ఆయా పాఠశాలలకు తరలించారు. మిగతా పాఠశాలల్లోను వేసవి సెలవులు ముగిసేలోపు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమం ద్వారా విద్యార్థులు చదవడం, రాయడం మరింత సులభంగా నేర్చుకునేలా ఇప్పటికే కృషి జరిగింది. మరోవైపు రీడింగ్ కార్నర్స్తో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయన్నది వాస్తవం.
పఠనాసక్తి పెంపునకు దోహదం
– రేణుకాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లా పరిధిలో 154 ప్రాథమిక పాఠశాలల్లో రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి రీడింగ్ కార్నర్లో 240 పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో కథల పుస్తకాలు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. విద్యార్థులు ధారాళంగా చదవగలిగేలా తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు పాఠశాలల పునః ప్రారంభం నాటికి అందుబాటులో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం.
148 స్కూళ్లలో లైబ్రరీల ఏర్పాటు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మన ఊరు-మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. దీనికితోడు జిల్లాలో 148 ప్రైమరీ పాఠశాలల్లో ప్రభుత్వం గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నది. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచేందుకు ఈ రీడింగ్ కార్నర్స్ తోడ్పాటునందిస్తాయి. ఒక్కో గ్రంథాలయానికి 240 పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తుంది.
– సుశీందర్రావు, జిల్లా విద్యాశాఖాధికారి