ధారూరు, నవంబర్ 9 : మనిషి మనుగడకు మొక్కలే జీవనాధారం మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచితే ఆ అనుభూతే వేరు. అందుకే ప్రభుత్వం అలాంటి అవకాశాన్ని కల్పిస్తోంది. ఆత్మీయుల జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండడానికి స్మృతి వనం ఏర్పాటు చేశారు. వనభోజనాలు చేయడం పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా విరాజిల్లే ఈ అడవిలో తిరిగి సేదతీరడం ఇక్కడి ప్రత్యేకత. అటవీశాఖ ఆధ్వర్యంలో ధారూరు మండల కేంద్రం సమీపంలో స్మృతివనం ఏర్పాటు చేసి మృతి చెందిన ఆత్మీయుల పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం స్మృతివనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నది. వికారాబాద్ జిల్లా ధారూరు మండల కేంద్రంలోని సోమశంకరప్ప దేవాలయం సమీపంలో వికారాబాద్-తాండూరు ప్రధాన రహదారి పక్కన స్మృతివనాన్ని మూడు సంవత్సరాల క్రితం 12ఎకరాల 20గుంటల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అప్పటి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ రూ.మనిషి మనుగడకు మొక్కలే జీవనాధారం మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచితే ఆ అనుభూతే వేరు.12లక్షలు స్మృతి వనం అభివృద్ధికి మంజూరు చేశారు. ఈ నిధులతో స్మృతి వనంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేశారు. స్మృతి వనంలో అందమైన కట్టడాలు, పర్యాటకులు సేద తీరడం కోసం చెట్ల వద్ద చిన్న చిన్న కట్టలు నిర్మించారు.
స్మృతి వనంలోని ఏర్పాట్లు
ధారూరు మండల కేంద్రానికి అతిదగ్గరలో స్మృతి వనాన్ని 12ఎకరాల 20గుంటల స్థలంలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. రూపుదిద్దుకున్న స్మృతివనంలో పర్యాటకులకు, పితృదేవతల పేరిట మొక్కలు నాటిన వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టూ అడవిని ఆస్వాదిస్తూ చల్లని గాలిని పీలుస్తూ వన భోజనాలు చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. ఈ స్మృతి వనంలో ప్రధాన గేట్, రచ్చబండలు, బోరు, మోటారు, పైప్లైన్, గజబోను లను నిర్మించారు. స్మృతి వనం చుట్టూ రెండు మీటర్ల లోతు, వెడల్పుతో పహరీ(జాలీలతో)కాకుండా కందకాలు తవ్వించారు. స్మృతివనంలో దాదాపు 1.8లక్షల వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. స్మృతివనానికి వేసవి కాలంలో సందర్శకులు అధికంగా వస్తుంటారని స్థానికులు తెలుపుతున్నారు.
మృతుల పేరిట మొక్కలు నాటేందుకు అవకాశం
మృతి చెందిన వారి పేరిట మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు స్మృతివనంలో అవకాశం కల్పించారు. స్మృతివనంలో ఆత్మీయుల పేరిట మొక్కలు నాటి సంరక్షించాలనుకునే వారు రూ.5వేలు అటవీశాఖ ఖాతాలో జమ చేయాలి. అనంతరం సిబ్బందితో ఆత్మీయుల పేరిట స్మృతి వనంలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుంటారు. స్మృతి వనంలో వివిధ రకాల మొక్కలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నారు. మొక్కలు నాటడానికి గుంతలు తవ్విస్తుంటారు. నాటిన మొక్క ఎలా ఉందో ఇక్కడికి వచ్చి పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా వచ్చి వారి జ్ఞాపకాలను తలచుకుంటూ మొక్కల వద్ద గడపవచ్చు. అప్పటి వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణకుమారి వారి నాన్న పేరిట జ్ఞాపకార్థంగా మామిడి మొక్క, అన్న పేరిట జ్ఞాపకార్థంగా అల్లనేరేడు మొక్కను నాటారు.
12ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు
12ఎకరాల 20గుంటల స్థలంలో ధారూరులో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశాం. కొందరు ఆత్మీయుల జ్ఞాపకాలు ఎన్నటికీ మరుపురావు. అలాంటి వారి పేరిట మొక్కలు నాటి ఆ చెట్టున నీడన సేద తీరితే ఆ అనుభూతే వేరు. మొక్కలు పెంపకం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఎవరైనా తమ పూర్వికుల పేరిట ఈ స్మృతి వనంలో మొక్కలు నాటే అవకాశం ఉంది. వాటి సంరక్షణ కోసం రూ.5వేలు అటవీశాఖ ఖాతాలో జమచేయాలి. వారు ఎంపిక చేసుకున్న చెట్లు సంరక్షణ ఎలా ఉందో పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ సమేతంగా ఈ స్మృతి వనానికి వచ్చి వన భోజనాలు సైతం చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి వారం పర్యాటకులు స్మృతి వనానికి వస్తుంటారు.
– టి. కృష్ణ, అటవీశాఖ రేంజ్ అధికారి, ధారూరు