ఇబ్రహీంపట్నం, మార్చి 5 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. గతవర్షాకాలంలో ఈ బ్రిడ్జిలపై నుంచి వరదనీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల వద్ద వర్షాలకు ఇబ్రహీంపట్నం పెద్దచెరువు అలుగు పారడంతో బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించింది. దీంతో ఈ బ్రిడ్జిని పూర్తిగా తొలగించి కొత్తగా బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కోహెడ నుంచి పెద్దఅంబర్పేటకు వెళ్లే మరో రెండు ప్రధాన కల్వర్టులకు ప్రభుత్వం మరో రూ.5కోట్లను కేటాయించింది.
లష్కర్గూడ బ్రిడ్జికి రూ.6.50కోట్లు..
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అబ్దుల్లాపూర్మెట్ నుంచి లష్కర్గూడ వెళ్లే రహదారిలో అత్యంత ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిని తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ రెండు గ్రామాల మధ్యవాగుపై గతంలో ఎప్పుడో వేసిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. వర్షంనీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండటంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రతి వర్షాకాలంలో లష్కర్గూడ, ఇనాంగూడ, అనాజ్పూర్, మజీద్పూర్ తదితర గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. రెండేండ్ల కింద ఈ బ్రిడ్జిపై నుంచి వాగులో కొట్టుకుపోయి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కూడా ప్రభుత్వం రూ.6.50కోట్లు కేటాయించింది. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వచ్చే వర్షాకాలం నాటికి బ్రిడ్జిల నిర్మాణం పూర్తికి కృషి..
వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలోని ప్రధాన బ్రిడ్జిలన్నింటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. గత వర్షాలకు ఈ బ్రిడ్జిలపై నుంచి వర్షంనీరు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు కేటాయించింది. బ్రిడ్జిల నిర్మాణంలో పూర్తిగా పారదర్శకత పాటిస్తాం. వీటిలో ప్రధానమైనవి హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బ్రిడ్జి ఒకటి కాగా, మరొక్కటి లష్కర్గూడ బ్రిడ్జి వీటి నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం