రంగారెడ్డి, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఫంక్షన్లు.. ప్రారంభోత్సవాలు.. ఏ శుభ కార్యంలోనైనా అలంకరణకు ‘జెర్బరా’ పూలు ఉండాల్సిందే. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ప్రాంతాల్లోనే సాగైన ఈ పూలు ప్రస్తుతం తెలంగాణలోనూ సాగవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అనేక పల్లెలు ఈ పూల సాగునే చేపడుతున్నాయి. పాలీ హౌస్లలో ఈ తోటల సాగుకు గత కేసీఆర్ ప్రభుత్వం రాయితీలు కల్పించడంతో రైతాంగం జెర్బరా పూల సాగును చేపట్టి రూ.లక్షల్లో లాభాన్ని ఆర్జిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
సిరులు కురిపిస్తున్న పూల సాగు..
చన్వెల్లి, గుండాల, ఇక్కారెడ్డిగూడ, కందవాడ, పామేనా, కమ్మేట, దేవునిఎర్రవెల్లి గ్రామాల పరిధిలో 62 ఎకరాల్లో జెర్బరా పూల తోటలను స్థానిక రైతులు సాగు చేస్తున్నారు. కేవలం చన్వెల్లి, ఇక్కారెడ్డిగూడ గ్రామాల పరిధిలోనే 44 ఎకరాలు సాగవుతున్నది. ఐదు, ఆరు విభిన్న రంగుల్లో సాగవుతున్న ఈ పూలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సాధారణ పంటల్లో నష్టాలు వచ్చినప్పటికీ పూల సాగు ఆర్థికంగా రైతులు నిలదొక్కుకునేందుకు దోహదపడుతున్నది. పండుగలు, శుభ కార్యాల సందర్భాల్లో అటు రైతులు, ఇటు వ్యాపారులకూ లాభాల పంట పడుతున్నది. పూలను గుడి మల్కాపూర్ మార్కెట్లో విక్రయిస్తుండగా.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వ్యాపారులు తరలిస్తున్నారు. ఒక నెలలో ఏడెనిమిది దఫాలుగా పూల కోతను చేపట్టవచ్చు. అర ఎకరాకు 14 నుంచి 15 బాక్స్ల వరకు దిగుబడి వస్తుండగా.. ఒక్కో బాక్స్ రూ5వేల వరకు ధర పలుకుతున్నది. ఈ పూల సాగుతో ఏడాదికి రూ.20లక్షలు సంపాదిస్తున్న రైతులూ ఉన్నారు. జెర్బరా పూల సాగుతో కూలీలకు సైతం పుష్కలంగా ఉపాధి దొరుకుతున్నది.
తోడ్పాటునందించిన కేసీఆర్ ప్రభుత్వం..
జెర్బరా పూల సాగు చేయాలంటే ఒకప్పుడు ఆర్థికంగా ఉన్న రైతులకు మాత్రమే సాధ్యపడేది. పాలీ హౌస్లలో ఈ తోటల సాగును చేపట్టాల్సి ఉండడంతో టెంట్, స్ప్రింక్లింగ్, పెస్టిసైడ్స్, మొక్కల కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే కేసీఆర్ ప్రభుత్వం పాలీహౌస్ల ఏర్పాటుకు రాయితీలు కల్పించి ప్రోత్సహించింది. దీంతో చిన్న, సన్నకారు రైతులు సైతం జెర్బరా పూలను సాగు చేస్తున్నారు. కూరగాయలు, పండ్ల సాగుతో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ప్రత్యేకతను పొందగా.. పూల సాగులోనూ జిల్లా ప్రత్యేక గుర్తింపును పొందుతున్నది. ప్రతి సీజన్లోనూ జిల్లాలో 5 వేల ఎకరాల్లో పూల తోటలే సాగవుతుండగా.. ఏడాదికి 50వేల మెట్రిక్ టన్నుల వరకు పూల దిగుబడులు వస్తున్నాయి.
ఏడాదికి రూ.15 లక్షల లాభం..
2016 సంవత్సరం నుంచి జెర్బరా పూలను సాగు చేస్తున్నాను. సాగు కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇచ్చింది. పూలను కోసి రాత్రి ఒంటి గంటకు గుడిమల్కాపూర్ మార్కెట్కు వెళ్లి అమ్ముకుని వస్తా. ఖర్చులు అన్నీపోను ఏడాదికి రూ.15లక్షల వరకు ఆదాయం వస్తున్నది. జెర్బరా పూల సాగు మొదలు పెట్టిన తర్వాత రూ.40లక్షలతో ఇల్లు కూడా కట్టుకున్నాను. సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చే సంపాదన వస్తుండడంతోపాటు మరో నలుగురైదురికి ఉపాధి కూడా కల్పిస్తున్నాను.
-ఎస్.మాణిక్య రెడ్డి, రైతు, దేవునిఎర్రవల్లి గ్రామం
12 ఏండ్లుగా పూలు సాగు..
వ్యవసాయంలో నష్టాలు రావడంతో జెర్బరా పూల సాగును మొదలు పెట్టిన. 12 ఏండ్లుగా పాలీహౌస్లో పూలను సాగు చేస్తున్న. తొలుత పావు ఎకరంలోనే సాగు చేసిన. లాభాలు బాగుండడంతో మరో ఎకరంలో ఆరేండ్లుగా పూల సాగును చేస్తున్న. మా కుటుంబంతోపాటు ఇద్దరు కూలీలతో నిత్యం పూల సాగును చూసుకుంటున్నాం. ఫంక్షన్లలో ఈ పూలను వినియోగించడం వల్ల మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. సీజన్ను బట్టి 6 లక్షల నుంచి 10 లక్షల వరకు సంపాదించుకుంటున్న.
-దావల్గారి అంజిరెడ్డి, రైతు, పామేనా గ్రామం