వెల్దండ, డిసెంబర్ 2 : రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100 సీట్లు ఖాయమని, మూడోసారి సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తాడని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జి గోళి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పగటికలలు కంటుందని, అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనన్నారు.
తప్పుడు సర్వేలు చూసి కాంగ్రెస్ సంకలు గుద్దుకుంటుందన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టిందో చెప్పాలన్నారు. రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి, దేశంలోనే నెంబర్వన్గా తీర్చిదిద్ధిన ఘనత కేసీఆర్దేనన్నారు. కల్వకుర్తిలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురనుందని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు నాగులునాయక్, తారాసింగ్ ఉన్నారు.
ఆమనగల్లు, డిసెంబర్ 2 : నిర్దేశిత గడువులోగా చౌకధర దుకాణాలకు రేషన్ బియ్యం చేరవేయాలని పౌర సరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గిడ్డంగుల నిర్వహణలో ఏమరపాటు, ఉదాసీనత, అవకతవకలు ఉంటే ఉపేక్షించేది లేదని ఆయన గిడ్డంగి నిర్వాహకులకు సూచించారు. భారత ఆహారసంస్థ నుంచి వస్తున్న స్టాక్పై కూడా ఏవైనా అనుమానాలుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు. తూకం వేయకుండా లోడ్ ఎందుకు చేస్తున్నారాని ఆయన గిడ్డంగి బాధ్యులను ప్రశ్నించారు.
కల్వకుర్తి రూరల్, డిసెంబర్ 2 : పాఠశాలస్థాయి నుంచి విద్యార్థులు సేవాభావాలు, మానవతా విలువలు పెంపొందించుకోవాలని సత్యసాయి బాలవికాస్ శిక్షకులు లత, మాధురిలు కోరారు. శనివారం పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలోని ఏడవ తరగతి నుంచి తొమ్మిదోతరగతి విద్యార్థులు మానవతా విలువలతో కూడిన విద్యపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం సత్యసేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రమాదేవి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
కడ్తాల్, డిసెంబర్ 2 : నియోజకవర్గంలోని నిరుపేదలకు ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ట్రస్టు సభ్యులు అన్నారు. తలకొండపల్లికి చెందిన వడ్డెర జంగయ్యకు నాల్గేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ఇటీవల గ్రామస్థులు మిషన్ భగీరథ వైస్ చైర్మన్, జెడ్పీటీసీ వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం బాధితుడికి మూడుచక్రాల బండి కోసం ట్రస్ట్ తరఫున రూ.20 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదల ఇండ్ల నిర్మాణాలను ట్రస్టు తరఫున సాయం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బుచ్చిబాబు, రఘువీర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.