యాచారం, మే6: పల్లెల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడంకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే పల్లె ప్రకృతివనాలు, బృహత్ ప్రకృతివనాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి. రోడ్లపై నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఈ ఏడాది హరితహారం ద్వారా మొక్కలు నాటి మరింత పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో నర్సరీల ద్వారా మొక్కలు సిద్ధం చేశారు. మండలంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. మండలంలోని 24గ్రామాలకు ప్రతి నర్సరీలో 18,000ల చొప్పున 4.32లక్షల మొక్కలను పెంచుతున్నారు.
ప్రతి నర్సరీలో వివిధ రకాల మొక్కలు..
మండలంలోని 24గ్రామాల్లోని ప్రతి నర్సరీలో ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పండ్లు, పూలు, కలపనిచ్చే వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. మండలంలో 4.32లక్షలకు తక్కువ కాకుండా మొక్కలను సంరక్షిస్తున్నారు. జామ, నిమ్మ, టేకు, వేప, మునగ, కానుగ, అల్లనేరేడు, దానిమ్మ, బొప్పాయి, కృష్ణతులసీ, సీతాఫల్, తుర్కవేప, చింత, గన్నేరు, గోరింటాకు, మందార, చామంతి, ఉసిరి, టెకోమ, గంగరావి, గుల్మొహర్, రెయిన్ట్రీ, చిన్నబాదం తదితర మొక్కలతో పాటుగా పలు రకాల పండ్ల మొక్కలను హరితహారంలో నాటేందుకు సిద్ధంగా ఉంచారు. మొక్కలు పూర్థి స్థాయిలో నాటి లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నాటేందుకు మొక్కలు సిద్ధం
మండలంలో 24నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు హరితహారంలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. 30సెంటీ మీటర్ల ఎత్తులో 3,24,000లు, 30నుంచి 60సెంటీ మీటర్ల ఎత్తులో 86,400లు, 60నుంచి 90సెంటీ మీటర్ల ఎత్తులో 21,600 మొక్కలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మొక్కలు నాటే సమయానికి మరికొన్ని మొక్కలు 90నుంచి 120 సెంటీ మీటర్ల ఎత్తులో పెరుగనున్నట్లు ఈజీఎస్ అధికారులు తెలిపారు. అవి మండలంలో రోడ్లకు ఇరువైపులా నాటేందుకు ఎంతో సులువుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
వేసవిలో మొక్కలపై ప్రత్యేక దృష్టి
వేసవిని దృష్టిలో పెట్టుకొని మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ప్రతి నర్సరీకి గ్రీన్ షెడ్లను ఏర్పాటు చేశారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి లెక్క తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. కలుపు మొక్కలను తొలగిస్తూ మొక్కలను ఏపుగా పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
టార్గెట్ పూర్తిపై దృష్టి
మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఖాలీ స్థలాలను గుర్తించడం కోసం క్షేత్ర స్థాయిలో ఉపాధి సిబ్బంది, అధికారులు సమీక్షిస్తున్నారు. మండలంలోని ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు, చెరువు గట్లు, బస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రోడ్లు, ప్రార్థనా మందిరాలు, వైకుంఠధామాలు, అటవీభూములు, బంజారు భూములు, రైతు పొలాలు, గట్లు తదితర స్థలాల్లో మొక్కలు నాటడానికి అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
4.32లక్షల మొక్కలు
ఈజీఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో 24నర్సరీల్లో మొత్తం 4.32లక్షల మొక్కలు పెంచుతున్నట్లు ఏపీవో లింగయ్య తెలిపారు. ఇందులో జామ 37,940, నిమ్మ 16,850, దానిమ్మ 3,500, మందారం 4,950, కనకాంబరం 7,900, కజ్జూర 5,000, కరివేపాకు 3,500, గోరింటాకు 3,100, నేరేడు 5,000, సీతాఫల్ 27,400, రావి 2,700, పెల్టోఫోరమ్ 1,500, టేకు 42,000, వేప 4,000, గుల్మొహర్ 25,900, కానుగ 9,520, కుంకుడు 13,800, మల్బార్ వేప 4,500, పచ్చ గన్నేరు 11,490, వెదురుబొంగు 13,520, చింత 5,200, మునగ 4,000, కొనోకార్పస్ 4,000, టెకోమ 17,820, తులసీ 500, చీమచింత 14,830, బొప్పాయి 4,900, గన్నేరు 11,490, ఇతర మొక్కలు 1,11,690 మొక్కలను పెంచుతున్నారు.
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
హరితహారం కింద మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ప్రతి నర్సరీలో 18,000ల చొప్పున 4.32లక్షల మొక్కలను పెంచుతున్నాం. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఖాలీ స్థలాలను గుర్తించి గుంతలను తీయిస్తాం. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రైతులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, పౌరులు సహకరించాలి.
– విజయలక్ష్మి, ఎంపీడీవో