ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు జీవో 59 కింద స్వీకరించిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ నేటి నుంచి షురూ కానున్నది. దీనికోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. జీవో 59కి సంబంధించి జిల్లాలో మొత్తం 13,229 దరఖాస్తులురాగా.. వీటిని పరిశీలించేందుకు 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా అధికారులతోపాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేది(2014 జూన్ 2)ని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించనున్నారు.
ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఆమోదం, లేకపోతే తిరస్కరించడం చేయనున్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుదారులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరను చెల్లించి ఇండ్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ అమయ్కుమార్ ఆదేశం మేరకు దరఖాస్తుల వెరిఫికేషన్ను దసరాలోగా పూర్తి చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది.
రంగారెడ్డి, సెప్టెంబర్ 21, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్నది. జీవో 59 దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా 32 బృందాలను కలెక్టర్ అమయ్కుమార్ ఏర్పాటు చేశారు. దరఖాస్తుల పరిశీలనకుగాను జిల్లా అధికారులతో స్థానిక రెవెన్యూ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా జీవో 59 కింద 13,229 దరఖాస్తులు రాగా, 38,43,899 చదరపు గజాల క్రమబద్ధీకరణకుగాను దరఖాస్తు చేసుకున్నారు. 2014 జూన్ 2వ తేదీలోగా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లను మాత్రమే క్రమబద్ధీకరించే సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీని పరిగణనలోకి తీసుకొని సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి గ్రౌండ్స్థాయిలో నిర్మాణాలను బట్టి దరఖాస్తులను తిరస్కరించడమా, ఆమోదించడమనే వివరాలను ఆన్లైన్లో వెరిఫికేషన్ బృందాలు పొందుపర్చనున్నాయి. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించి 150 గజాలకు మించి ఉన్న ఇండ్ల స్థలాలకు కనీస ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్న వారు 50 శాతం మేర ఇండ్లు నిర్మించి ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 250 గజాల్లోపు ఇల్లు నిర్మించుకున్నట్లయితే 25 శాతం కనీస ధరను, 251-500 గజాల్లో ఇల్లు నిర్మించుకున్నట్లయితే 50 శాతం కనీస ధరను, 500-1000 గజాల్లో ఇల్లు నిర్మించుకున్నట్లయితే 75 శాతం, 1000 చదరపు గజాలపైన ఉన్నట్లయితే వివరాలను ప్రభుత్వానికి అందజేయనున్నారు.
పరిశీలనకు 32 ప్రత్యేక బృందాలు..
జీవో 59 దరఖాస్తుల పరిశీలనకుగాను ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల జిల్లా అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందితో కూడిన 32 బృందాలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 14 బృందాలు, హయత్నగర్ మండలంలో 5 బృందాలు, సరూర్నగర్ మండలంలో 3 బృందాలు, బాలాపూర్లో రెండు బృందాలు, శంకర్పల్లిలో మూడు బృందాలు, షాద్నగర్, చేవెళ్ల మండలాలకు ఒక టీం, రాజేంద్రనగర్, గండిపేట మండలానికి ఒక బృందం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల మండలాల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ఒక బృందం, కందుకూరు మండలానికి ఒక బృందం దరఖాస్తులను పరిశీలించనున్నది. ఒక్కో బృందం రోజుకు 25-30 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
దసరా పండుగలోగా జీవో 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను చలాన్, విద్యుత్తు బిల్లు, నీటి బిల్లులను, గృహనివాసమా లేదా కమర్షియల్ భవనమా, శాశ్వత ఇల్లు లేదా తాత్కాలికంగా నిర్మించినదా, ఎన్ని అంతస్తులు, ప్లాట్ విస్తీర్ణం వివరాలు, నిర్మించిన ఇల్లు విస్తీర్ణం వివరాలు, డాక్యుమెంట్, కోర్టు కేసు వివరాలు, ఇంటికి నాలుగు వైపులా ఉన్న బౌండరీ వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూములు జాబితా(అసైన్డ్ భూములు, మిలిటరీ-కంటోన్మెంట్, రిజర్వ్ ఫారెస్ట్ భూములు, కోర్డు కేసు, ఖాళీ స్థలం, మెట్రోరైల్కు కేటాయించిన స్థలం, కుంట, శిఖం, ఎఫ్టీఎల్, ఎనిమీ భూములు, సర్కారీజంగాలట్, బోనవెకేటియా భూములు, భూదాన్, పట్టా, దేవాదాయ, వక్ఫ్, డిఫెన్స్, స్మశానవాటిక భూములు)లో ఉందా లేదనేది పరిగణనలోకి తీసుకొని వెరిఫికేషన్ చేయనున్నారు.