అది అతిపురాతనమైన శివాలయం (సిద్దేశ్వరాలయం). ఒకప్పుడు అభిషేకాలు, నిత్యపూజలతో విరాజిల్లిన దేవాలయం, భక్తల కొంగు బంగారంగా కొలిచే శివాలయ అభివృద్దిని పట్టించుకునేనాదుడే లేకపోవడంతో అది రోజురోజుకు శిథిలావస్థకు చేరుకుంటుంది. దీంతో అలనాటి కాకతీయుల కళాసంపద క్రమంగా కాలగర్బంలో కలిసిపోతుంది. అత్యంత మహిమాన్వితమైన శివయ్య దర్శన భాగ్యం భక్తులకు కరువయ్యింది.
గ్రామంలో నందీశ్వరాలయం, జ్ఞాన సరస్వతీ మందిరం, ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ది చెందగా ఓంకారేశ్వరాలయం సైతం పునర్నిర్మాణం కొనసాగుతుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం మాత్రం అభివృద్దికి నోచుకోవడంలేదు. శివరాత్రి, కార్తికపౌర్ణమి, నాగుల పంచమి పర్వదినాలలో ఆలయాన్ని అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. ఆలయాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.
– యాచారం, డిసెంబర్ 15
శివాలయం గర్భగుడిలో భక్తులకు అద్భుతం కనిపిస్తుంది లోపలి నుంచి పైభాగంలో రాతిపైన శ్రీచక్రాన్ని అమర్చడం భక్తులు అద్భుతంగా భావిస్తారు. ఎంతో కళాత్మకంగా రాతితో పైకప్పు భాగానికి శ్రీచక్రాన్ని అమర్చడంతో ఆలయానికి ప్రసిద్ధమైన చరిత్ర ఉందని పూర్వికులు చెబుతుంటారు. శ్రీశైలం మల్లికార్జున ఆలయం, తమిళనాడులోని మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అరుదుగా కనిపించే శ్రీచక్రం ఇక్కడ ఉండడం మహా అద్భుతంగా భావిస్తారు. శ్రీచక్రాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
శివాలయంలోకి అప్పుడప్పుడు తెల్లవారుజామున సూర్యకిరణాలు ప్రవేశిస్తాయని పూర్వికులు తెలిపేవారు. ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు పడటంతో లోతట్టుగా ఉన్న గర్భగుడిలోని శివలింగం సూర్యకాంతి తేజస్సుతో కాంతులీనుతుంది. ఈ ఘటన కేవలం మార్చి నెలలో ఒక్కసారి మాత్రమే చోటు చేసుకుంటుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ అరుదైన దృశ్యం చుట్టుపక్కల ఎక్కడ చూడలేమంటున్నారు. భూమికి ఐదారడుగుల లోతులో కొలువుదీరిన శివలింగంపై సూర్యకిరణాలు పడడం మహా అద్భుతమంటున్నారు.
శివలింగానికి కుడి భాగంలో ఆరు బయట పురాతన కాలంనాటి నాగులమ్మల ప్రతిమలు రాతి బొమ్మలుగా నిలిచాయి. వివిధ ఆకారాల్లో నాగదేవత, నాగుపాముల విగ్రహాలు మహిమగలిగినవని భక్తుల నమ్మకం. ప్రతీ నాగుల చవితి రోజున స్త్రీలు ఆలయాన్ని సందర్శిస్తారు. నాగులమ్మల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకాలు నిర్వహించి, పసుపు కుంకుమల బొట్లతో ఎంతో అందంగా అలంకరిస్తారు. కొబ్బరికాయలు కొట్టి, విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీటికి సైతం నిలువ నీడతో పాటుగా ఎలాంటి రక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అలనాటి శిల్ప సంపదను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
అలయం ఎదుట కళాత్మకమైన కోనేరును నిర్మించారు. నాలుగు వైపులా మెట్లను ఏర్పాటు చేశారు. ముందుగా కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. కోనేరును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి సమీపంలోని నంది విగ్రహాన్ని కుక్క నందిగా భావిస్తారు. గ్రామానికి వచ్చే పోయే వారిని గమనిస్తూ కాపలగా ఉంటుందని నమ్మకం. గుప్తనిధులకోసం గతంలో దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి తన సొంత నిధులతో ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మించి రెండు గేట్లను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్రెడ్డి ఆలయానికి దారిని ఏర్పాటు చేశారు. శివరాత్రి ఉత్సవాలను నిర్వహించి, స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఏటా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.
మండల పరిధిలోని నందివనపర్తి గ్రామంలో అక్కన్న, మాదన్నల కాలంలో సుమారు 15వ శతాబ్ద కాలంలో నిర్మించిన అతి పురాతన శివాలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఆలయంలో శివుడు లింగాకారంలో స్వయంభుగా వెలిశాడని ప్రతీతి. రాతి స్తంభాలతో నిర్మించిన అలనాటి శిల్పకళా సంపద దర్శనమిస్తున్నది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా విగ్రహాలు, భారీ శివలింగం, శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయంలోని శివలింగాన్ని తలపించడం ఇక్కడి విశేషం. ఆలయానికి మూడు దర్వాజలు కలిగి భూమికి లోతులో గర్భాలయం ఉంటుంది. పూర్తిగా ఏకశిలా బండపై శివలింగం ఉండడం గమనార్హం.
గర్భగుడిలో శివలింగం ఎదుట నంది విగ్రహం ఉండగా, బయట మరో నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఆలయం అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటుంది. నాడు కళకళలాడిన ఆలయం నేడు కళతప్పి వెలవెల బోతున్నది. శివరాత్రి, కార్తిక పౌర్ణమి, నాగుల పంచమి పర్వదినాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆలయ సమీపంలో నాగు పాము సంచరిస్తుందని, గర్భగుడిలోని శివలింగాన్ని చుట్టుకుంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆలయానికి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఎంతో చరిత్ర కలిగిన శివాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహాయసహకారాలను అందిస్తా. ఇప్పటికే ఆలయానికి దారి లేకపోవడంతో ప్రత్యేక దారిని ఏర్పాటు చేశాం. దేవాదాయ శాఖ శివాలయంపై దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేయాలి. గ్రామస్తులంతా శివాలయం పునర్నిర్మాణానికి కృషి చేయాలి. ఆలయంలో భక్తులకు అన్ని రకాల వసతులను కల్పించాలి. పురాతన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి.
– బిలకంటి చంద్రశేఖర్రెడ్డి, బీఎన్రెడ్డి ట్రస్టు చైర్మన్ (నందివనపర్తి)