నవాబుపేట, మే 17: మండల పరిధిలోని అర్కతాల గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం భూమిపై ప్రజల నుంచి అభిప్రాయ సేరణను ఆర్డీవో విజయకుమారి, అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం సర్పంచ్ రాములు ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి ఆర్డీవో విజయకుమారి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు లావునీ పట్టా కింద ఇచ్చిన భూమిని అవసరం వచ్చిపుడు తీసేసుకుంటుంది అది మీకు ముందే తెలుసు కదా అని రైతులను అడిగారు. అవును అని రైతులు సమాధానం ఇచ్చారు.
దీంతో రైతులు అందరూ కలిసి మాట్లాడుకుని మార్కెట్ రేట్ కాకుండా రూ. 18లక్షలు ఇచ్చి మా కుటుంబంలో ఇద్దరికి చొప్పున చదువును బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని కోరగా, పైఅధికారులకు మీ అభిప్రాయాలను తీసుకెళ్తామని సమాధానం ఇచ్చారు. దీంతో రైతులు సర్వే నం 32లోని 60 మంది రైతులు సంతకాలు చేసిన కాపీని అధికారులకు అందజేశారు. అనంతరం ఆర్డీవో విజయకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం రూ.16 లక్షలు ఇస్తుందని చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆర్డీవోకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ రవీందర్, సర్పంచ్ రాములు, ఎంపీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్ సంగారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.