సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో 23 చోట్ల బహుళ వినియోగ మరుగుదొడ్లు అందుబాటులోకి రానున్నాయి. సీఎస్ఆర్ పద్ధతిలో 14 సంవత్సరాల కాల వ్యవధితో మల్టీపర్పస్ పబ్లిక్ ఫ్రెష్ రూమ్స్ (టాయిలెట్లు) ఏర్పాటుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ‘ ది అర్బన్ లూ కంపెనీ సొంత నిధులతో టాయిలెట్లను నిర్మించి, నిర్వహణ చేపట్టనుంది. పే అండ్ యూజ్ పద్ధతిలో వినియోగదారుల నుంచి రుసుం వసూలు చేయనుంది. ఈ టాయిలెట్లలో శానిటరీ నాప్కిన్ల డిస్పెన్సరీ, బేబీ చేజింగ్ స్పేస్, వాటర్ లెస్ టాయిలెట్, వాసనలేని యూరినల్స్ తదితర ప్రత్యేకతలు ఉంటాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 18 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.
బక్రీద్ను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మేయర్ సూచించారు. బక్రీద్ సందర్భంగా నగరంలోని రోడ్లు, మజీద్లను శుభ్రం చేయాలని, రోడ్లపై పేరుకుపోయిన చెత్తను వెనువెంటనే తొలగించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన వార్డు ఆఫీస్ కార్యాలయాల అధికారులు పబ్లిక్ గ్రీవెన్స్ను స్వీకరించి నిర్ణీత కాలంలో పరిష్కరించేలా జోనల్ కమిషనర్లు పర్యవేక్షించాలని తెలిపారు. వార్డు కార్యాలయాలపై కార్పొరేటర్లు స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ సోహెల్ఖాద్రీ, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ అబ్దుల్ ముక్తర్, మహమ్మద్ రషీద్, ఫరాజుద్దీన్, ఆర్ సునీత, టి. మహేశ్వరీ తదితరులు పాల్గొన్నారు.