తుర్కయాంజాల్, ఫిబ్రవరి 10 : రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో తుర్కయాంజాల్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. రంగారెడ్డి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో 37 మందిలో ఒకడిగా ఎంపికై పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు. అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయాంజాల్ గ్రామానికి చెందిన గుండా వెంకటేశ్ కుమారుడు గుండా శ్రీనివాస్ అదే గ్రామంలోనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2020-21 సంవత్సరంలో 10వ తరగతి చదివాడు. జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎగ్జిబిట్స్లో శ్రీనివాస్ అత్యుత్తమ ప్రదర్శన చూపి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపికై తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. శ్రీనివాస్ నగరంలోని హస్తినాపురంలోని ఓ జూనియర్ కాలేజీలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
శ్రీనివాస్ గత సంవత్సరం 2021లో 10వ తరగతి చదువుతున్నప్పుడు లాక్డౌన్ సమయంలో పాఠశాల ఉపాధ్యాయుడు కరుణాకర్రెడ్డి ప్రోత్సాహంతో జనవరి 28, 29 తేదీల్లో ఇన్స్పైర్ పేరిట నిర్వహించిన సైన్స్ఫెయిర్లో పాల్గొని ఆన్లైన్లో వర్చువల్ మోడ్ ద్వారా తన ప్రదర్శనలు ప్రజెంట్ చేశాడు. ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ 14-20 వరకు రంగారెడ్డి జిల్లా స్థాయిలో నిర్వహించిన సైన్స్ఫెయిర్లో శ్రీనివాస్ పాల్గొని 430 మంది విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 7 ప్రాజెక్టుల్లో మొదటిస్థానంలో నిలిచాడు. 2022 జనవరి 27-29 తేదీల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో 280 మంది విద్యార్థులు పాల్గొనగా, శ్రీనివాస్ మరోసారి ఆన్లైన్లో ఉత్తమ ప్రదర్శన చేసి జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపికయ్యాడు.
శ్రీనివాస్ తయారు చేసిన విధానం పలువురిని ఆకట్టుకుంటున్నది. వ్యర్థ వాయువులతో సులువుగా విద్యుత్ను ఎలా తయారీ చేయవచ్చో అర్థవంతంగా తన ఎగ్జిబిట్ ద్వారా శ్రీనివాస్ తెలియపరిచాడు. భారీ పరిశ్రమల్లో ఉండే పొగగొట్టాల ద్వారా వెలుబడే వ్యర్థ వాయువులతో విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు అని శ్రీనివాస్ తన ప్రదర్శనతో నిరూపిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. పొగగొట్టాల మధ్యలో టర్భైన్లు అమర్చి వాటి మీదుగా వ్యర్థ వాయువులను అధిక వేగంతో బయటికి విడుదల చేయాలి. అలా వాయువులను పంపుతున్నప్పుడు టర్భైన్లు తిరిగి అవి డైనమోకు అనుసంధానమై ఉండటం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ఇలా జనరేట్ చేయబడిని విద్యుత్తో అదే పరిశ్రమలోని స్ట్రీట్ లైట్లు, మోటార్లను నడిపేందుకు, చిన్ని చిన్న విద్యుత్ పరికరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థ వాయువులను ఉపయోగించి విద్యుత్ను తయారు చేయటం వల్ల ఎలాంటి హాని లేకపోగా, సులువుగా విద్యుత్ను తయారు చేసి పరిశ్రమ అవసరాలకు ఉపయోగించుకోవచ్చును.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే నా ప్రాజెక్టుకు మరిన్ని మెరుగులు దిద్ది నా ఆలోచనలకు పదును పెడుతాను. భారీ పరిశ్రమలకు అత్యంత సులువుగా చౌకగా విద్యుత్ ఉత్పత్తి అందేలా కృషి చేస్తాను. వ్యర్థ వాయువులను తక్కువ ఖర్చుతో మరింత సులువుగా ఎలా వాడుకొని విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చునో మరింత లోతుగా అధ్యయనం చేస్తాను. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయికి అక్కడి నుంచి రాష్ర్టానికి ఆ తరువాత జాతీయస్థాయికి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ఫెయిర్లో కూడా అత్యుత్తమ ప్రదర్శనగా నా ప్రాజెక్టును నిలిపి రాష్ర్టానికి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాను.
– గుండా శ్రీనివాస్ (విద్యార్థి)