బొంరాస్పేట, డిసెంబర్ 15 : ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్సీలు, సీఆర్సీల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేసే విషయంలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. నిధుల ఖర్చులో పారదర్శకత కోసం పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం(పీఎఫ్ఎంఎస్) విధానంలో నిధులు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానంపై జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని పాఠశాలలు, ఎంఆర్సీలు, సీఆర్సీల నిర్వహణకు ప్రభుత్వం ఇటీవల 50 శాతం నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ఇకమీదట పాత విధానంలో కాకుండా పీఎఫ్ఎంఎస్ విధానంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
నమోదు చేస్తేనే బిల్లులు
పాత విధానంలో ఎస్ఎంసీ ఖాతా, క్లస్టర్ హెచ్ఎం ఖాతా, ఎంఈవో ఖాతాల్లో నిధులు జమయ్యేవి. వాటిని ఎస్ఎంసీ చైర్మన్, హెచ్ఎం కలిసి ఖర్చు చేసేవారు. పనులు చేసిన వారికి చెక్కుల రూపంలో చెల్లింపులు చేసేవారు. అవసరమైన వారికి బిల్లులు ఇచ్చేవారు. ఇకపై నూతన విధానంలో ఇలా ఉండదు. విద్యాశాఖ వద్దే నిధులుంటాయి. ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులు పీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి. ఇందులో పొందుపరిచే బిల్లుల ఆధారంగా పనులు చేసిన కాంట్రాక్టర్, ఎస్ఎంసీ చైర్మన్, సామగ్రి కొనుగోలు చేసిన దుకాణం యజమాని ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు.
పాఠశాల అవసరాలకు ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా అవసరానికి ఎవరికైనా డబ్బులు చెల్లించినా, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాలన్నా సంబంధిత వ్యక్తికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో పొందుపర్చాలి. ఈ విధానంతో నిధులు పక్కదారి పట్టకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
విడుదలైన నిధులు రూ.1.67 కోట్లు
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు, ఎంఆర్సీలు, సీఆర్సీలకు విద్యాశాఖ ఇటీవల 50 శాతం నిధులను విడుదల చేసింది. 1067 పాఠశాలలకు రూ.1,48,87,500, 17 ఎంఆర్సీలకు రూ.7,65,000, 64 సీఆర్సీలకు రూ.10,56,000 నిధులు విడుదలయ్యాయి. నిధులను పీఎఫ్ఎంఎస్ విధానంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానాలపై జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.
పారదర్శకత కోసమే..
– రవికుమార్, సెక్టోరియల్ అధికారి
నిధుల ఖర్చు ఇకమీదట ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎఫ్ఎంఎస్ విధానంలో చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో చేసే చెల్లింపులు పారదర్శకంగా ఉంటాయి. పనులు చేసిన వారికి చెక్కు ఇవ్వకుండా.. వారు చేసిన పనిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే నేరుగా ఆ వ్యక్తి ఖాతాలోకి డబ్బులు జమవుతాయి. ఈ విధానంపై హెచ్ఎంలకు శిక్షణ కూడా ఇచ్చాం.