అన్నదాతలకు మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అండగా నిలువగా.. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో వికారాబాద్ జిల్లా కూడా ఉన్నది. కులకచర్లలోని శ్రీ రామలింగేశ్వర ఎఫ్పీవో(రైతు ఉత్పతిదారుల సంస్థ) ద్వారా విత్తన శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేయనున్నది. ఒక్క యూనిట్కు రూ.60లక్షలు వెచ్చించనున్నది. ఈ నిధుల నుంచి రూ.36లక్షలకు పైగా గోదాం నిర్మాణానికి ఖర్చు చేయనుండగా.. రూ.23లక్షలతో యంత్ర పరికరాలు కొనుగోలు చేయనున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన విత్తనాలను ఎఫ్పీవో బ్రాండ్ పేరిట రైతులకు అందించనున్నారు. దీంతో రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు లభించనుండడంతో ఎంతో మేలు జరుగనున్నది.
పరిగి, ఆగస్టు 5: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగడంతోపాటు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఎంతో తోడ్పాటును అందిస్తున్నది. ఎఫ్పీవో(రైతు ఉత్పత్తిదారుల సంస్థ)ల ద్వారా రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం సీహెచ్సీలను ఏర్పాటు చేసింది. తద్వారా రైతులకు తక్కువ ధరకే వ్యవసాయ యంత్ర పరికరాలు అం దుతుండటంతోపాటు ఎఫ్పీవోలు కూడా ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే కులకచర్లలోని శ్రీ రామలింగేశ్వర ఎఫ్పీవో (రైతు ఉత్పత్తిదారుల సంస్థ) అందించిన సేవలకుగానూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును నిర్వాహకులు అందుకున్నారు. అంతేకాకుండా శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో మామిడిపండ్ల ఎగుమతులను ప్రారంభించి రైతులకు మే లైన విత్తనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. వికారాబాద్ జిల్లాలోని ఎఫ్పీవో ద్వారా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను రూ.60 లక్షలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నాలుగు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లను వరంగల్, సంగారెడ్డి, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో ఎఫ్పీవోల ద్వారా ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు.
వివిధ మేలు రకం విత్తనాలను ..
వివిధ మేలు రకం విత్తనాలను ప్రాసెసింగ్ చేసి చెత్త, తాలు, ఇతర వ్యర్థాలను తొలగించి మంచి విత్తనాలను రైతులకు అందించాలన్నదే ఈ యూనిట్ ఏర్పాటు ఉద్దేశం. ప్రధానంగా పెసర, మినుములు, కందులు తదితర విత్తనాలను ఫౌండేషన్ సీడ్గా రైతులకు అందజేసి సాగు చేసిన తర్వాత ఎఫ్పీవో ద్వారా కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి రైతులకు మళ్లీ మేలు రకం విత్తనాలను అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ విత్తనాలు రెండు,మూడు పర్యాయాలు వాడినా మంచి దిగుబడులు వస్తాయి. అందువల్ల ఈ విత్తనాలను రైతులకు ఇచ్చి పంట పండిన తర్వాత తిరిగి కొనుగోలు చేసి ఇతర రైతులకు అందజేసేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ప్రక్రియలో విత్తనాలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఎలాంటి చెత్త, తాలు, ఇతర వ్యర్థాలు లేని విత్తనాలు రైతులకు తక్కువ ధరకు అందుబాటులో కి వస్తాయి. దీంతోపాటు ఎఫ్పీవోకు వ్యాపార లావాదేవీలు పెరిగి ఆర్థిక ప్రగతిని సాధిస్తుంది. ఇం దుకుగాను వ్యవసాయ శాఖ సైతం పూర్తిస్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థకు సహకరిస్తున్నది. కాగా కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో గత రెం డు సీజన్లుగా మామిడిపండ్లను ఎగుమతి చేస్తున్నది. ఈసారి ఏకంగా ఢిల్లీలోని తెలంగాణభవన్లో విక్రయించేందుకు వీలుగా సెర్ప్, ఉద్యానవన శాఖ సహకారంతో ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసి మరీ అనంతగిరి మ్యాంగోస్ పేరిట మామిడిపండ్ల విక్రయాల ను చేపట్టింది. సీడ్ ప్రాసెసింగ్ చేపట్టి మంచి విత్తనాలను ఎఫ్పీవో బ్రాండ్ పేరిట కూడా విక్రయించనున్నట్లు సమాచారం. దీంతో కులకచర్లలోని ఎఫ్పీవో ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల రైతులకు మన్నికైన విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి.
కులకచర్లలో రూ.60 లక్షలతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్
వికారాబాద్ జిల్లాకు కేటాయించిన సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను కులకచర్లలోని శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో ద్వారా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కులకచర్ల మండల మహిళా సమాఖ్య ద్వారా శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఈ యూనిట్ను రూ.60లక్షలతో ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్కు సంబంధించిన సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ నిధుల్లో రూ.36 లక్షలకు పైగా ఖర్చు చేసి పంచాయతీరాజ్ శాఖ ద్వారా గోదామును నిర్మించనున్నారు. 500 చదరపు గజాల స్థలంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేసి.. రూ.23 లక్షలకు పైగా వెచ్చించి అవసరమయ్యే యంత్ర పరికరాలను సమకూర్చనున్నారు. అనంతరం సీడ్ ప్రాసెసింగ్ చేసి ఎఫ్పీవో ద్వారా విక్రయించనున్నారు.
మేలు రకం విత్తనాలు రైతులకు అందుతాయి
జిల్లాలోని కులకచర్లలో ఉన్న శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో ఆధ్వర్యంలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రూ. 60 లక్షలు మంజూరయ్యాయి. వ్యవసాయ శాఖ సహకారంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. సీడ్ ప్రాసెసింగ్ చేసి మేలు రకాలైన విత్తనాలను ఎఫ్పీవో బ్రాండ్ పేరిట విక్రయిస్తాం. తద్వారా రైతులకు మంచి విత్తనాలు అందుతాయి. తద్వారా ఎఫ్పీవోకు వ్యాపార లావాదేవీలు పెరిగి ఆర్థిక ప్రగతిని సాధిస్తుంది.
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి