దీర్ఘకాలిక రోగులకు అవసాన దశలో అన్ని తానై అండగా నిలుస్తున్నది చేవెళ్లలోని ఆత్మీయ చికిత్స కేంద్రం(ఆలన). జీవితం చరమాంకంలో ఉన్న ఎంతోమంది రోగులను అమ్మలా అక్కున చేర్చుకుంటున్నది. మొదట ఈ కేంద్రాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేయగా.. సేవల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ సర్కార్ మరింతమందికి మేలు చేకూరేలా తన ఆధీనంలోకి తీసుకొని కొనసాగిస్తున్నది. వసతులను మెరుగుపర్చి, వైద్య సిబ్బందిని నియమించి మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘పాలియేటివ్ కేర్’ యూనిట్ ద్వారా దీర్ఘకాలిక, మానసిక వ్యాధిగ్రస్తులకు మెరుగైన ఉచిత చికిత్స, పోషకాహారాన్ని అందిస్తున్నది. ఈ కేంద్రాన్ని 2017 సంవత్సరంలో ప్రారంభించగా.. ఇప్పటివరకు 18,38 మందికి చికిత్స అందించారు. క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ, డయాలసిస్, షుగర్, హెచ్ఐవీ, మానసిక తదితర వ్యాధిగ్రస్తులకు ఇక్కడి సిబ్బంది ఆత్మీయతతో కూడిన వైద్యమందిస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నారు.
నయం కాని ఎన్నో రోగాలకు ‘ఆలన’ కేంద్రం చెక్ పెడుతున్నది. దీర్ఘకాలికంగా పలు రకాల వ్యాధులతో బాధపడుతూ జీవిత తుది అంకంలో ఉన్న రోగులను అక్కున చేర్చుకుంటున్నది. అలాంటి వారికి కావలసిన సేవలను ‘పాలియేటివ్ కేర్’ యూనిట్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నది. వివిధ రకాల వ్యాధులతో అనాదిగా బాధపడుతూ, మానసికంగా కుంగిపోయిన రోగులకు మనోధైర్యాన్ని ఇస్తున్నది ఈ కేంద్రం. మొదట ఈ కేంద్రాన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేశాయి. ఐనప్పటికీ ప్రభుత్వం సహృదయంతో ‘ఆలన’ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ ఆ కేంద్రాన్ని తన ఏలుబడిలోకి తీసుకొని కొనసాగిస్తున్నది. వాటికి మరికొన్నింటి సేవలను కల్పిస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న ఎంతో మంది పేదలను ఆదుకుంటూ అక్కున చేర్చుకుంటున్నది. చేవెళ్లలో ఆత్మీయ చికిత్స కేంద్రాన్ని 2017 అక్టోబర్ నెలలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రవాణా శాఖ మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి చేవెళ్లలో ఉపశమన ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ, డయాలసిస్, డయాబెటిస్, హెచ్ఐవీ, మానసిక వ్యాధిగ్రస్తులతోపాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆత్మీయ చికిత్స కేంద్రం ఎంతో ఆసరాగా నిలుస్తున్నది.
రంగారెడ్డి, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : ఆధునిక వైద్య శాస్త్రంలో పాలియేటివ్ కేర్ అనేది ఒక కొత్త వైద్య విధానం. కేన్సర్, హృదయ సంబంధిత, శ్వాసకోశ, డయాబెటిస్ వంటి ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడేవారికి అందించే చికిత్స పూర్వక సేవలు ఇవి. బాధిత కుటుంబ సభ్యులు ఎదుర్కొనే ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని ఈ కేంద్రం చికిత్స అందిస్తూ రోగులు పొందే నొప్పి, బాధలు నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటివారే దూరం చేసే పరిస్థితిలో ప్రభుత్వం వారికి ఉచిత సేవలు అందిస్తూ మంచి పోషకాహారం ఇస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నది.
ఎనిమిది పడకలతో యూనిట్
‘వరల్డ్ హోస్పైస్ అండ్ పాలియేటివ్ కేర్’ ఆధ్వర్యంలో ‘విశ్వ ఆరోగ్య సంరక్షణ, ఆత్మీయ చికిత్స పరిపూర్ణ బాధా విముక్తి’ అనే భావనతో 2017లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేవెళ్లలోని ఏరియా దవాఖానలో పాలియేటివ్ కేర్ కేంద్రాన్ని ప్రారంభించింది. మొదట ఇందులో ఐదు పడకలతో ఈ యూనిట్ కొనసాగింది. ప్రస్తుతం ఎనిమిది పడకలతో యూనిట్ నడుస్తున్నది. ఈ కేంద్రంలో ఇన్ పేషంట్, అవుట్ పేషంట్, డే కేర్, హోం కేర్ వంటి అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, హోం కేర్ సర్వీసెస్తో గ్రామాల్లోకి అంబులెన్స్ ద్వారా వెళ్లి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం, చేవెళ్లలోని పాలియేటివ్ హోం కేర్ సర్వీసెస్ నం.91216 91902ను సంప్రదిస్తే సేవలు అందుబాటులో ఉంటాయని పాలియేటివ్ కేర్ నిర్వాహకులు తెలుపుతున్నారు.
దీర్ఘకాలిక వ్యాధుల బాధితులకు ఆసరా..
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఎంత భయానక వ్యాధికి అయినా చికిత్స అందిస్తూ అవసరమైన చికిత్స, మందులు అందిస్తూ సమయానికి భోజనం, వసతిని కల్పిస్తున్నారు. చికిత్స కొనసాగుతున్న సమయంలో వ్యాధి బాధితులు ఎవరైనా మరణించిన తర్వాత ఇంటికి తీసుకుపోవడానికి ఇక్కడ అంబులెన్స్ను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారు. చిన్నపిల్లలకు దీర్ఘకాలిక వ్యాధులుంటే వారికి కూడా సేవలందిస్తున్నారు.
ఇప్పటివరకు 1838 మందికి సేవలు
చేవెళ్ల పాలియేటివ్ కేర్ కేంద్రంలో 2017 నుంచి సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గత ఐదేండ్ల నుంచి ఇప్పటివరకు 1838 మంది దీర్ఘకాలిక రోగులకు సేవలు అందాయి. అందులో 1194 మంది క్యాన్సర్ రోగులు కాగా, 641 మంది నాన్ – క్యాన్సర్ రోగులు, మరో ముగ్గురు ఇతరులు ఉన్నారు. యూనిట్లో ఆరు పడకలు నిత్యం నిండుగానే కొనసాగుతున్నాయి. రోజుకు ఇరవై మందికి పైనే అవుట్ పేషంట్లు ఇక్కడ చికిత్సా పూర్వక సేవలు పొందుతున్నారు.
ఆత్మీయ సేవలు
డాక్టర్లు ఇక్కడ సక్కగా చూస్తుండ్రు
– సంతోష, అమ్డాపూర్, మొయినాబాద్
నాకు పక్షవాతం వచ్చింది. చాలా రోజుల నుంచి బాధపడుతున్న. కొన్ని దవాఖాల్లో చూపించుకున్న. అయినా నయం కాలేదు. చేవేళ్ల ప్రభుత్వ దవాఖానలో చూస్తున్నరు అంటే.. ఇక్కడికి వచ్చిన. ఈడ డాక్టర్లు, నర్సులు మంచిగా చూస్తుండ్రు. యాలకు ఇంత బువ్వ పెడుతున్నరు. మందులు వేస్తున్నరు. ఎప్పటికప్పుడు డాక్టర్లు, నర్సులు నా ఆలత్ గురించి చెక్ జేస్తుండ్రు. ఇంత సక్కగా ఎక్కడ కూడా సూడరు. ఇన్ని సౌలతులు ఏర్పాటు చేసిన కేసీఆర్ సారుకు నేను రుణపడి ఉంటా.
ప్రభుత్వానికి రుణపడి ఉంటం
– మహిపాల్, కంకల్, పూడూరు
నేను బొక్కల క్యాన్సర్తో బాధపడుతున్న. అక్కడ, ఇక్కడా అంతటా.. చానా దవాఖానల్లో చూపించుకున్న. చానా డబ్బులు ఖర్చు చేసుకున్న. ఎక్కడ కూడా ఇక్కడ చూసినంత గొప్పగా చూడలేదు. పైసలు లేకుండా ఉచితంగా చూస్తుండ్రు. ఇసువంటి సౌలతులు కల్పించిన సర్కారు గొప్పది. కేసీఆర్ సారుకు నా అసువంటోళ్లు రుణపడి ఉంటరు. ఇక్కడ ఉచితంగా అందిస్తున్న సేవలు ఎక్కడా దొరకవు.
క్యాన్సర్ వచ్చిందిగా.. సచ్చిపోతా అనుకున్న..
– వెంకటేశ్, మోత్కూరు, పరిగి
నేను కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న. ఈ రోగం వస్తే చనిపోవడమే అనుకున్న. నాకు తెలిసినోళ్లు చెప్పితే ఇక్కడికి వచ్చిన. కొన్ని రోజులుగా ఇక్కడ చికిత్స చేయించుకుంటున్న. కాస్త పానం తేలికైంది. ఇక్కడ మంచి మందులు, తిండి, పడుకునేందుకు బెడ్లు, సౌలతులు ఇచ్చిండ్రు. మాకు సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, సర్కారుకు నాలాంటోళ్లం అంతా రుణపడి ఉంటాం. ఎక్కడా ఇంత సక్కటి సౌకర్యాలు దొరకవు.
సేవలందించడమే మా లక్ష్యం : శమంత, స్టాఫ్ నర్స్, చేవెళ్ల పాలియేటివ్ కేర్
చేవెళ్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ కేంద్రం నిత్యం రోగుల సేవలో కొనసాగుతున్నది. ఇక్కడికి వచ్చిన పేషంట్లను ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నం. సర్కారు నిర్వహిస్తున్న ఈ యూనిట్ క్యాన్సర్ రోగులకు ఓ వరం. ప్రభుత్వం మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తున్నది. రోగులకు చికిత్స అందిస్తూ, వారికి పౌష్టికాహారాన్ని అందిస్తూ, వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నాం.
దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా విలువైన సేవలు
– డాక్టర్ మనీష్చంద్ర, వైద్యాధికారి, చేవెళ్ల పాలియేటివ్ కేర్
దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నవారికి మా యూనిట్లో ఉచితంగా సేవలందిస్తున్నాం. క్యాన్సర్, పెరాలసిస్ లాంటి దీర్ఘకాలిక రోగులు ఇక్కడ ఉపశమనం పొందుతున్నారు. ఇప్పటివరకు 1838 మంది రోగులు సేవలు పొందారు. ఆ తర్వాత వారి ఇండ్లకు చేరుతున్నారు. రికవరీ అధికంగా ఉంది. 5 శాతం మంది మాత్రమే మృతి చెందుతున్నారు. ఎలాంటి రుసుం తీసుకోకుండా ఉచితంగా ప్రభుత్వం చికిత్సలు అందిస్తున్నది. ఎంతో భయానకమైన వ్యాధి అయినా సరే.. నొప్పి తెలియకుండా ఉండేందుకు వారికి సేవలందిస్తున్నాం.