షాబాద్, ఫిబ్రవరి 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,844 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు ప్రతిరోజూ కంటి వెలుగు క్యాంపులను పర్యవేక్షించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 15,844 మందికి కంటి పరీక్షలు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 15,844 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,336 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 2,015 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 5628 మందికి ..
వికారాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వికారాబాద్ జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాలో 5628 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 999 మందికి రీడింగ్ గ్లాస్లు పంపిణీ చేయగా, 786 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 61 గ్రామాలు, 18 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
సంతోషంగా ఉంది..
కంటి వెలుగు మంచి కార్యాక్రమం. ఇలాంటి కార్యాక్రమం దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణలో ఏర్పాటు చేయడం మన అదృష్టం. మునుపు కంటి పరీక్షలు చేసుకోవడానికి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఊర్లకే వచ్చి కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు అద్దాలు అవసరమవుతాయని పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చారు.
– డి.కిష్టయ్య, కౌకుంట్ల , చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా
పేద కుటుంబాల్లో కంటి వెలుగు
కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. కంటి పరీక్షలు చేయించుకుందామనుకుంటే డబ్బులు లేవు. వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోకి వెళ్లి చూయించుకోవాలి. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద లైన్లో వేచి ఉండాలే. ముఖ్యమంతి సారు మా బాధలు తెలుసుకొని మా గ్రామంలోనే కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగానే పరీక్షలు చేసి, అవసరమున్న వారికి మందులను ఇచ్చి, అద్దాలను పంపిణీ చేశారు.
– బిల్లిపూరం అంజయ్య, గ్రామం అన్నాసాగర్
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మొదటి విడుతలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో మా ఇంట్లో ఇద్దరికీ పరీక్షలు చేయించి అద్దాలను తీసుకున్నాం. ఈ సారి రెండో విడుతలో నేను శిబిరంలో పరీక్షలను చేయించుకుని అద్దాలను తీసుకున్నా. మా గ్రామంలోకి వైద్యులు వచ్చి పరీక్షలను చేసి మందులు, అద్దాలను ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– అంతారం గోవిందమ్మ, గ్రామం అన్నాసాగర్