ఆదిబట్ల, మార్చి 2 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నూతన కంపెనీలను ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, కొంగరకలాన్ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకు పోతున్నది. ఇప్పటికే కొంగరకలాన్లో జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కాగా.. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ రానున్నది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పేందుకు తైవాన్ దేశం ముందుకు వచ్చింది.
ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో కంపెనీని ఏర్పాటు చేయనుండడంతో దాదాపు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. భూ పరిశీలన కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఎలక్ట్రికల్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కేటాయించిన సర్వే నం.300లోని భూమిని గురువారం ఆ కంపెనీకి చెందిన యంగ్లియూతోపాటు 15 మంది సభ్యులతో కూడిన బృందం భూమిని పరిశీలించారు. ప్రాంతమంతా తిరిగి స్థానిక అధికారుల నుంచి సమాచారం సేకరించారు.
రంగారెడ్డి జిల్లా సిగలో మరో మణిహారం
అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ‘ఫాక్స్ కాన్’ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఒప్పందం చేసుకోవడం శుభపరిణామమని మంత్రి సబితారెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకులు ంటే ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్కు, తెలంగాణను పెట్టుబడుల స్వర్గధామంగా మార్చుతున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు ఇదో శుభదినమని, చరిత్రలో ఇది నిలిచిపోతుందని, ప్రతిష్టాత్మక ఫాక్స్ కాన్ సంస్థ రాకతో జిల్లాలో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి అన్నారు.
అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ (హోన్ హై ఫాక్స్ కాన్) తమ ఉత్పత్తి కార్యకలాపాలను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా నుంచి చేపట్టనుండటం ఎంతో హర్షదాయకమని మంత్రి పేర్కొన్నారు. ప్రగతిభవన్లో గురువారం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ‘ఫాక్స్కాన్’ చైర్మన్ యంగ్ల్యూకితో ఒప్పందం చేసుకోవడం రంగారెడ్డి జిల్లా చరిత్రలో నిలిచిపోయే రోజని మంత్రి అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో మంత్రి కేటీఆర్ చొరవ ఎంతో గొప్పదని మంత్రి సబితారెడ్డి కొనియాడారు.
కేసీఆర్, కేటీఆర్ చొరవతో మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే కిషన్రెడ్డి
కేసీఆర్, కేటీఆర్ చొరవతో ఇబ్రహీంపట్నం మరింత అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎన్నో బహుళజాతి కంపెనీలు ఏర్పాటు చేయగా అభివృద్ధితోపాటు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు కొంగరకలాన్లో రూ.3500 కోట్లతో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీని ఏర్పాటు చేయడంతో మరో లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కేటీఆర్ ప్రత్యేకంగా ఈ కంపెనీని ఏర్పాటు చేయడానిక కృషి చేస్తున్నారు.