గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం పండుగలా సాగుతున్నది. క్యాంపులకు ప్రజలు భారీగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి అవసరమైనవారికి మందులు, కండ్లద్దాలు అందజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా కంటి సమస్యలు తీరుతుండడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో 15,931 మందికి, వికారాబాద్ జిల్లాలో 5,716 మందికి కంటి పరీక్షలు చేశారు.
షాబాద్, ఫిబ్రవరి 9: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కంటి వెలుగు కార్యక్రమం ఓ వరంలా మారింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులకు వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పరీక్షలు చేసిన వైద్యులు అవసరం ఉన్న వారికి మందులు, కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో గురువారం 80 బృందాల సభ్యులు 15,931 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకే వైద్య బృందాల సభ్యులు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకుంటున్నారు. జిల్లాలో కొనసాగుతున్న క్యాంపులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితోపాటు, డివిజన్ స్థాయి వైద్యాధికారులు సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు. ‘కంటి వెలుగు’ విజయవంతమయ్యేలా సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని కంటి వెలుగు శిబిరాల్లో గురువారం వైద్యులు 15,931 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. 2,124 మందికి అద్దాలు పంపిణీ చేశా రు. 1,757 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. గతంలో కంటి సమస్యలతో ఎన్నో దవాఖానలు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని.. సీఎం కేసీఆర్ తమ గ్రామాల్లోనే క్యాంపులను ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయించడం సంతోషంగా ఉందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 9: అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శిం చి పర్యవేక్షిస్తున్నారు. గురువారం జిల్లాలో 5,716 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 1,089 మందికి అద్దాలను పంపిణీ చేశా రు. 766 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటివరకు 75 గ్రామాలు, 22 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
దృష్టి లోపం సమస్యతో నా కండ్లు మసక మసకగా కనిపించేవి. మా గ్రామంలో ప్రభుత్వం కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేసిందని తెలుసుకుని వచ్చా. పరీక్షించిన వైద్యులు దృష్టి లోపం ఉందని చెప్పి.. ఉచితంగా మందులు, కంటి అద్దాలు ఇచ్చారు. వాటిని పెట్టుకున్నప్పటి నుంచి కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి.
– వినోద, కళానగర్, పసుమాముల గ్రామం
కంటి వెలుగు కార్యక్రమంతో పేదలు కంటి పరీక్షలు చేయించుకోవడం సులువుగా మారింది. సీఎం కేసీఆర్ పేదలకు ఇబ్బంది కలుగకుండా గ్రామాలు, పట్టణాల్లోనే కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. వైద్యులు గ్రామాలకు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, అద్దాలు పంపిణీ చేస్తున్నా రు. నేను కూడా పరీక్షలు చేయించుకోగా వైద్యులు అద్దాలు, మందులు ఇచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా. – మహ్మద్ రహీం, కౌకుంట్ల గ్రామం, చేవెళ్ల మండలం
నేను ఆటో నడిపి జీవిస్తున్నా. దృష్టి లోపం సమస్యతో దగ్గర ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించడంలేదు. మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు మందులు, కంటి అద్దాలు ఇచ్చారు. దగ్గర చూపు కోసం పెట్టుకోవాలని చెప్పారు. వాటిని వాడుతున్నా. ప్రస్తుతం కండ్లు బాగా కనిపిస్తున్నాయి.
– చంద్రయ్య, పసుమాముల