తాండూరు, ఫిబ్రవరి 4 : గత సాధారణ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. బుధవారం తాండూరులోని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా 1వ వార్డులో నాగలక్ష్మి, 21లో టిప్పు, 22లో భాస్కర్, 23వ వార్డులో పరిమళకు మద్దతుగా ఆయా వార్డుల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణాలు, గ్రామాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరిగాయి. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేశాం. నేడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, వృద్ధులకు రూ.4 వేల పింఛన్లు నెరవేర్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరులోని ప్రతి వార్డులో రూ.కోటి చొప్పున, నిధులు వెచ్చించి సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మించుకున్నామని గుర్తు చేశారు. మరి ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తాండూరు పట్టణ అభివృద్ధికి వచ్చిన నిధులెన్ని అని ప్రశ్నించారు.
ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి గతంలో బీఆర్ఎస్ పాలనలో మంజూరైన నిధులతోనే కొన్ని పనులను ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రోజు ప్రారంభించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి మోసపోయారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా ఇలాంటి మోసపూరిత హామీలనే ఇచ్చి ఓట్లు రాబట్టుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తారని.. వారి మోసాలకు బుద్ధి చెప్పేలా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు నాయకులు శ్రీనివాస్చారి, బంటారం సుధాకర్, రవీందర్, కేశవులు పాల్గొన్నారు.