కొడంగల్, ఏప్రిల్ 20 : బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. శనివారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డితో కలిసి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో విఫలమైందన్నారు. ప్రజలు, రైతులను మోసం చేసేందుకు పార్లమెంటు ఎన్నికలను అడ్డు పెట్టుకొని బూటకపు గ్యారెంటీలతో మళ్లీ ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని, రైతుబంధు రూ.15వేలు అందిస్తామని నేటి వరకు ఏ ఒక్కరికీ అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి అన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రూ.10వేలు కూడా అందించలేదన్నారు. రైతు బీమా ఊసే లేదన్నారు. పంట అమ్ముకోవడానికి రైతులకు ఎలాంటి భరోసా కల్పించడం లేదని ఆరోపించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం పత్తాలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలో కరువు ఛాయలు అలుముకొన్నాయని, తాగు, సాగు నీరు, విద్యుత్ తదితర సమస్యలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండేవి కావన్నారు. కరెంటు, తాగు, సాగునీటి కష్టాలను మరిచిపోయారన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాత రోజులతో కన్నీటి పర్యంతం అవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఇలాంటి దుర్భర పరిస్థితి నెలకొంటే, వచ్చే ఐదేండ్లలో ఎలాంటి కష్టాలను అనుభవించాల్సి ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే ప్రజలు ఈసడించుకొంటున్నారని, ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి జనం ఇటువైపు చూస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పూర్తి మద్దతు ఇద్దామని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కోరారు. పాలమూరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు. కేంద్రంలో తెలంగాణ వాణీని వినిపించాలంటే బీఆర్ఎస్ నాయకులకే సత్తా ఉందన్నారు. కాంగ్రెస్కు ప్రజా సంక్షేమంపై చిత్త శుద్ధి లేదన్నారు. అధికారం కోసం బూటకపు హామీలను ఇస్తున్న కాంగ్రెస్ను నమ్మవద్దని తెలిపారు.
గతంలో చేసిన తప్పు చేయకుండా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని.. అప్పుడే కాంగ్రెస్కు బుద్ధి చెప్పడంతో పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు. గత పదేండ్లు బీజేపీ పాలనను ప్రజలు చూశారని, ఆ పార్టీతో తెలంగాణకు ఒరిగిందేమి లేదని ఆరోపించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ నారాయణపేట జిల్లా మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణతో పాటు బీఆర్ఎస్ నాయకులు జనార్దన్రెడ్డి, బందెప్ప, చాంద్పాషా, ఉసేనప్ప, సాయిలు, నిరంజన్రెడ్డి, మోహన్గౌడ్, చైతన్యాగౌడ్, బుగ్గప్ప, వెంకట్రాములు, రుద్రప్ప, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.