కొడంగల్, ఏప్రిల్ 11 : రేవంత్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నదని.. అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మహాలక్ష్మీవేంకటేశ్వరాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధిక సీట్లు వస్తాయని నివేదికలు రావడంతో సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఈ నెల 6న తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని పూర్తిచేయడంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీ 120 రోజుల పాలన రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓ రెఫరెండమ్ అని.. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు.. అదేవిధంగా ఈ నెల 8న కొడంగల్లోని తన నివాసంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో.. కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పడం హాస్యాస్పదం’గా ఉందన్నారు. పై వ్యాఖ్యలను బట్టి తాను ఇన్చార్జిగా ఉన్న మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో ఓటమి ఖాయమని ఆయన ఒప్పుకొన్నట్లు నరేందర్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని చెప్పడం హేళనగా ఉన్నదని.. కుట్రలు పన్నుతున్నది కుటుంబ సభ్యులా..? కాంగ్రెస్ నాయకులా..? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 50 వేల మెజార్టీని సాధిస్తే కొడంగల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి.. లేదంటే జరగవు అన్నట్లుగా మాట్లాడుతూ ప్రజలను బ్లాక్మెయిల్, భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొడంగల్ అభివృద్ధికి రూ.4 వేల కోట్ల నిధులను మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేసిందన్నారు. ఎన్నికలకు ముందు మరో రూ.900 కోట్ల నిధులు మంజూరు కాగా.. వాటిని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
కొడంగల్ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టెక్స్టైల్, ఐటెక్స్, టెస్లా వంటి పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయాలని.. అంతేకాని సిమెంట్, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చేందుకు యత్నిస్తే వాటిని అడ్డుకుని ప్రజల పక్షాన పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. దౌల్తాబాద్ మండలంలోని చంద్రకల్ గ్రామంలో ఇదివరకే 100 ఎకరాల స్థలాన్ని కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందని, టెస్లా వంటి కార్ల కంపెనీని అక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.50 కోట్లను మంజూరు చేసిందని.. వాటిని నిర్మించకుండా రద్దు చేయడం తగదని నరేందర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కరువు ఛాయలు అలుముకున్నాయని, ఎక్కడ చూసినా అన్నదాతలు సాగునీటికి.. మహిళలు తాగునీటికి ఇబ్బందిపడుతున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి నిధులను మంజూరు చేసి కొడంగల్ను మరింతగా అభివృద్ధి చేయాలన్నారు. రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, యాదగిరి, నారాయణరెడ్డి, నరోత్తంరెడ్డి, రాజేందర్, పవన్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.