రంగారెడ్డి, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి డంపింగ్యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు, గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా సిద్ధాపూర్ నుంచి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. కాగా, డంపింగ్యార్డు హటావో….సిద్ధాపూర్ బచావో పేరుతో నిర్వహించిన ర్యాలీని సబితాఇంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
కాగా, డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందని ముందుగానే తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఆందోళన కారులను దారి మధ్యలోనే నిలువరించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినా సిద్ధాపూర్వాసులు వాటిని దాటుకుని కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్దకు చేరుకోగా.. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించి పోలీసులు ఆందోళనకారులను లోపలికి అనుమతించలేదు.. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురిని బలవంతంగా అక్కడినుంచి బయటికి పంపించటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తోపాటు మరికొందరు కలెక్టరేట్లోకి వెళ్లి ప్రజావాణిలో ఉన్న కలెక్టర్కు సిద్ధాపూర్లో డంపింగ్యార్డును ఏర్పాటు చేయొద్దని వినతిపత్రాన్ని అందించారు. డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే ప్రజారోగ్యం, పర్యావరణం దెబ్బతినటంతోపాటు వ్యవసాయం, గ్రామ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని కలెక్టర్కు వివరించారు. స్పందించిన ఆయన డంపింగ్యార్డు రద్దు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

సిద్ధాపూర్వాసులకు సర్కార్ ఢోకా చేస్తున్నది..
సిద్ధాపూర్ గ్రామంలో ఐటీపార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, రైతులకు ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో గత కేసీఆర్ ప్రభు త్వం 340 ఎకరాలను సేకరించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జవహర్నగర్లో ఉన్న డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించి సిద్ధాపూర్లో పరిశ్రమలు నెలకొల్పే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా దారుణం. సేకరించిన భూముల్లో ప్రజారోగ్యం, పర్యావరణాన్ని దెబ్బతీసే డంపింగ్యార్డును ఏర్పాటు చేయాలని భావించడం సిద్ధాపూర్వాసులను ఢోకా చేయడమే.
సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే భూములను సేకరించగా.. రేవంత్ సర్కార్ ఆ పొలాల్లో డంపింగ్యార్డు ఏర్పాటుకు కుటిల యత్నాలు చేయడం సరైందికాదు. సిద్ధాపూర్తోపాటు చుట్టుపక్కల గ్రామాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లో డంపింగ్యార్డు చిచ్చు రేపొద్దు. డంపింగ్యార్డును ఏర్పాటుచేస్తే ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. వ్యవసాయానికి, తాగునీటికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి గ్రామాల భవిష్యత్తు అంధకారంగా మారే అవకాశమున్నది. సర్కార్ వెంటనే డంపింగ్యార్డు నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలి.
-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే

చెత్తమయం.. దుర్గంధభరితంగా మారుతుంది..
సిద్ధాపూర్లోని సర్వేనంబర్ 246లో 340 ఎకరాలను గత ప్రభుత్వం ఐటీపార్కు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు పేరుతో రైతుల నుంచి సేకరించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూముల్లో డంపింగ్యార్డు ఏర్పాటుకు యత్నించడం సిద్ధాపూర్వాసుల నమ్మకాన్ని వమ్ము చేయడమే. టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న ఈ భూములను డంపింగ్యార్డు ఏర్పాటుకోసం హెచ్ఎండీఏకు బదలాయించడం దారుణం. సిద్ధాపూర్లో డంపింగ్యార్డును ఏర్పాటు చేస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఘన, వ్యర్థ పదార్థాలతో ఈ ప్రాంతం మొత్తం చెత్తమయంగా.. దుర్గంధభరింగా మారుతుంది. వ్యవసాయం చేసుకుని జీవించే ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులతోపాటు నష్టపోయే ప్రమాదం ఉన్నది. వాయు, తాగునీటి కాలుష్యంతోపాటు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సర్కార్ వెంటనే ఆ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే ఆందోళననుతీవ్రతరం చేస్తాం.
– అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే, షాద్నగర్

