రంగారెడ్డి, జనవరి 17(నమస్తే తెలంగాణ) : భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తోపాటు ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు సన్నాహక సమావేశానికి తరలివెళ్లారు. నాగర్కర్నూల్ పార్లమెంటును మరోసారి గెలుచుకునేలా నేతలకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమావేశంలో దిశా నిర్దేశం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఎవరూ అధైర్యపడొద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు కాకమ్మ కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో కోకొల్లలని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిందని, అయితే ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం ఇప్పటికే చేతులెత్తేసిందన్నారు.
తెలంగాణలోనూ గ్యారంటీల చావు వార్తను కాంగ్రెస్ నేతలు చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ తెలంగాణను అభివృద్ధ్ది చేశారని, ఇది ఎవరూ కాదనలేని సత్యమని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తేనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కీలక సమయంలో బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లేకపోతే తెలంగాణకు నష్టమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా నేర్చుకుని ముందుకు సాగుదామని, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం 1967లో ఏర్పాటు కాగా దీని పరిధిలో వనపర్తి, గద్వాల్, ఆలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందగా ఎంపీగా రాములు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సన్నాహక సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. మరోసారి గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, తలకొండపల్లి, కడ్తాల్ జడ్పీటీసీలు ఉప్పల వెంకటేశ్, దశరథ్ నాయక్లు, వైఎస్ ఎంపీపీలు జక్కు అనంత రెడ్డి, ఆనంద్లు, సింగిల్ విండో ఛైర్మన్ గంప వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మండల అధ్యక్షులు అర్జున్ రావు, జైపాల్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.