ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 21 : భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బలహీనవర్గాలు, రైతులు, గ్రామీణ ప్రజల ప్రతినిధిగా బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ తిరుగులేని విజయం సాధించబోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల వ్యవధిలోనే విపరీతమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నదని, ఈ పార్లమెంటు స్థానంలో మూడో స్థానానికి కాంగ్రెస్పార్టీ పరిమితం కానున్నదని చెప్పారు.
ప్రజలకు గత అసెంబ్లీ ఎన్నికల ముందిచ్చిన హామీలనే నెరవేర్చకుండా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న కుటిల యత్నాలను ప్రజలు గమనించారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా కొనసాగించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నదని ఆయన విమర్శించారు.
నేడు భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గ రాములు, మైనార్టీ విభాగం నాయకుడు నవాజ్, రైతు విభాగం నాయకులు రాజిరెడ్డి, జనార్దన్రెడ్డి, మహేందర్రెడ్డి, బీసీ విభాగం నేత జగన్యాదవ్, యువవజన విభాగం నాయకుడు కలకొండ బాషా పాల్గొన్నారు.