హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని తెలిపారు. పచ్చదనం పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, దేశంలో మరే ఇతర రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. ఈ మేరకు కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పునరంకితం కావాలని ఆయన సూచించారు.
అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్లో ఉద్యోగులు, సిబ్బందితో కలిసి ఉన్నతాధికారులు కేక్ కట్ చేశారు. అటవీ అధికారుల సంఘం రూపొందించిన క్యాలెండర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో అటవీశాఖ జాయింట్ సెక్రటరీ ఎం.ప్రశాంతి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఎలూసింగ్ మేరు, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ.పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్, హైదరాబాద్ డీఎఫ్ఓ ఎం.జోజి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.