ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 16 : తమపై నమోదైన అక్రమ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్లో జామీను సమర్పించారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజుతోపాటు బీఆర్ఎస్ నాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మొదటి అక్రమ కేసు: మంచిరెడ్డి కిషన్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జామీను సమర్పించిన అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ బయట ఆయన నమస్తే తెలంగాణాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల తర రాజకీయ జీవితంలో ఒక్క కేసు కూడా లేదని, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇటీవల గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పరాకాష్టకు ఇది నిదర్శనమన్నారు.
మా పార్టీ సింబల్పై గెలుపొందిన కౌన్సిలర్ను తమవైపు తిప్పుకోవడం కోసం ఆశచూపి తమపై లేనిపోని కుట్రలు చేసి తప్పుడు కేసులు పెట్టించిన ఘనత మల్రెడ్డి రంగారెడ్డికే దక్కుతుందన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు గెలుపొంది బీఆర్ఎస్కు చైర్మన్, వైస్ చైర్మన్ అవకాశమున్నప్పటికీ అధికారం చేతిలో ఉందని ఇబ్రహీంపట్నంలో ఎన్నికల అధికారులు, పోలీసులను చేతిలో పెట్టుకుని చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేసి చివరకు చతికిలపడ్డారన్నారు.
మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలిచిందని తెలిపారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా.. అక్రమ కేసులు బనాయించినా ప్రజల తరపున ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతామని న్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరటంతో పాటు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఉక్రోశంతో చిల్లర మాటలు మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారని బాధ్యతగా సరైన సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.