వికారాబాద్, అక్టోబర్ 24, (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోష్ పెంచగా, ప్రతిపక్షాలు మాత్రం డీలా పడ్డాయి. బీజేపీ అభ్యర్థుల మొదటి లిస్ట్లో జిల్లాలోని ఒక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కూడా నెలరోజులు దాటుతున్నా కనీసం డిపాజిట్ దక్కించుకునే ఓట్లు వచ్చేవారు కూడా ఆశావాహుల్లో లేకపోవడంతో ఇంకా పెండింగ్లోనే పెట్టింది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభానికి మరో వారం రోజుల సమయమే ఉన్నా పోటీనిచ్చే అభ్యర్థులు లేకపోవడంతో బీజేపీ అధిష్టానం అయోమయంలో పడిపోయింది. ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు ఆశావహులు ఎక్కువగానే ఉన్నా అసలైనోళ్లు లేకపోవడంతో ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల వెతుకులాటలోనే ఉంది. జిల్లాలో బీజేపీ పార్టీకి క్యాడరే కాదు, నాలుగు నియోజకవర్గాలైన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన నాయకులు కూడా లేరు. జిల్లాలో అస్సలు క్యాడర్లేని బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమేనంటూ అన్ని వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. గత ఎన్నికల్లోనూ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపినప్పటికీ తాండూరు నియోజకవర్గం మినహా మిగతా నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు, మరీ ఈ ఎన్నికల్లో కూడా కనీసం పోటీనిస్తారా లేదంటే గత ఎన్నికల సీన్ రిపీట్ చేస్తారనేది త్వరలో తేలనున్నది.
ఒక్క నియోజకవర్గానికి ప్రకటించలే..
సార్వత్రిక ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో జిల్లాలోని ఒక్క నియోజకవర్గానికి కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. రెండు నెలల క్రితం వరకు మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీ బరిలో ఉండడం ఖాయమని అనుకున్నప్పటికీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని భావించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్లో చేరడంతో ఆయన వెంట ఉన్న క్యాడర్ కూడా కాంగ్రెస్లో చేరడం, వికారాబాద్ నియోజకవర్గంలో పోటీలో దింపేందుకు డిపాజిట్ ఓట్లు వచ్చే నాయకుడు లేకపోవడంతో ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో బీజేపీ నుంచి పోటీ చేసే అర్హతగల నాయకులు ఒక్కరూ లేకపోవడంతో పక్క జిల్లాకు చెందిన వారిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. పక్క జిల్లాకు చెందిన ఆశావహులు వికారాబాద్లో పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన కొప్పు బాషా, బోసుపల్లి ప్రతాప్లతోపాటు కృష్ణప్రసాద్, పటాన్చెర్కు చెందిన సహదేవ్ వికారాబాద్ నియోజకవర్గ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
అదేవిధంగా తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ ఎన్నికల్లో పోటీ చేసిన పటేల్ రవిశంకర్తోపాటు లక్ష్మారెడ్డి, రమేష్కుమార్, నరేష్ మహారాజ్ దరఖాస్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న పటేల్ రవిశంకర్ ఈ దఫా ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా,.. పార్టీ అధిష్టానం మాత్రం మరొకరిని దింపే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తాండూరు నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. కొండా విశ్వేశ్వర్రెడ్డి మాత్రం తాండూరు నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పరిగి నియోజకవర్గం నుంచి భునేటి కిరణ్, ఘణపురం వెంకటయ్య తదితరులు దరఖాస్తు చేసుకోగా, శంషాబాద్ ప్రాంతానికి చెందిన భునేటి కిరణ్కు టికెట్ వచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది. కిరణ్ స్థానికేతరుడని ముద్ర ఉండడంతో ఒకవేళ బరిలో దింపినప్పటికీ డిపాజిట్ ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో స్థానికుడైన ప్రహ్లద్రావు పోటీ చేయడంతో 6 వేల ఓట్లు పోలుకాగా, ఈ దఫా ఎన్నికల్లో వెయ్యిలోపే ఓట్లు పడే పరిస్థితులున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొడంగల్ నియోజకవర్గంలోనూ బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పోటీనిచ్చే అభ్యర్థులెవరూ లేకపోవడంతో పోటీ చేశామని చెప్పుకునేందుకుగాను ఎవరినో ఒకరిని బరిలో దింపేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.