సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్లో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి నాలుగేండ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రెండు మార్గాల్లో ఫ్లై ఓవర్లను నిర్మించాలని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటిని డబుల్ డెక్కర్ తరహాలో రోడ్డు మార్గం, మెట్రో మార్గం ఉండేలా నిర్మించాలని నిర్ణయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రోడ్డు, ఆ పైన ఫె్లైఓవర్ , రెండో అంతస్తులో మెట్రో కారిడార్ వచ్చేలా రూపొందించిన ప్రాజెక్టు వ్యయం రూ.5 వేల కోట్లగా అంచనా వేశారు. ఎంతో అత్యవసరమైన ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూముల సేకరణలో రక్షణ శాఖ నుంచి అనుమతులు రాలేదు.
ఇటీవలే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రక్షణ శాఖ అధికారులతో ప్రత్యేక మావేశమయ్యారు. ఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి ఎంతో కీలకమైన రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన భూముల విషయంపై చర్చించారు. అనంతరం సీఎస్ హెచ్ఎండీఏ అధికారులకు రెండు మార్గాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనల నివేదికను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు హెచ్ఏండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు రెండు మార్గాల్లో అవసరమైన రక్షణ శాఖ భూములతో కూడిన వివరాల ప్రత్యేక నివేదికను సిద్ధం చేస్తున్నారు. నాలుగేండ్లుగా పెండింగ్లో ఉన్న రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణంలో కదలిక వచ్చిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం..
కంటోన్మెంట్ ప్రాంతంలో ఇరుకు రహదారుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వైపు ఉండే ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకోవాలంటే రద్దీ వేళలో గంటకు పైగా సమయం పడుతున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్ -కరీంనగర్ మార్గంలో జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు 18.50 కిలోమీటర్ల మేర రెండంతస్తుల సైవేను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ -నాగ్పూర్ మార్గంలో ప్యారడైజ్ నుంచి కొంపల్లి తర్వాత వచ్చే ఆర్వోబీ వరకూ 18.35 కిలోమీటర్ల మేర డబుల్ డెకర్ సైవే సాధ్యాసాధ్యాలపై సంబంధిత కన్సల్టెన్సీ ప్రభుత్వానికి నివేదికను అందించడంతో నిర్మించేందుకు హెచ్ఎండీఏ నిధులను సమకూర్చుకున్నా, రక్షణ శాఖ నుంచి భూసేకరణలో వచ్చిన అడ్డంకులతోనే ఈ పనులు ఆదిలోనే ఆగిపోయాయి. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రక్షణ శాఖ అధికారులతో సమావేశం కావడంతో భూసేకరణ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.