వికారాబాద్, సెప్టెంబర్ 20, (నమస్తే తెలంగాణ) : మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే చేపల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేపపిల్లలను వదిలే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 348 చెరువుల్లో 50 లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ ఏడాది కోటి26 లక్షల చేపపిల్లలను పెంచేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 733 చెరువుల్లో చేపపిల్లలను వదలాలని నిర్ణయించగా, ఇప్పటివరకు 348 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. ఏడేండ్లుగా జిల్లాలోని చెరువుల్లో ప్రతి ఏటా చేపల పెంపకం పెంచుతూ వస్తున్నారు. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18.75 లక్షల చేప పిల్లలు, 2017-18లో 53.41లక్షలు, 2018-19లో 25.99 లక్షలు, 2019-20లో 197 చెరువుల్లో 41.54 లక్షలు, 2020-21లో 555 చెరువుల్లో 98.64 లక్షలు, 2021-22లో 691 చెరువుల్లో 1.17కోట్ల చేపలు, 2022-23లో 692 చెరువుల్లో కోటి18 లక్షల చేపపిల్లలను వదిలారు.
మొదట కేవలం 70 చెరువుల్లోనే చేపల పెంపకాన్ని ప్రారంభించగా, తదనంతరం ప్రతి ఏటా పెంచుతూ 700లకుపైగా చెరువుల్లో చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి సబ్సిడీ అందజేయడంతోపాటు చేపలను విక్రయించడంలోనూ మత్స్యకారులు నష్టపోకుండా కూడా చర్యలు చేపట్టింది. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్తో పాటు స్థానికంగా విక్రయిస్తూ లాభాలను పొందుతున్నారు. చేపలను విక్రయించేందుకుగాను 70 శాతం సబ్సిడీతో వాహనాలను ప్రభుత్వం మత్స్యకారులకు అందజేసింది. వందశాతం సబ్సిడీతో పంపిణీ చేసిన చేపలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు. జిల్లాలో 95 మత్స్యకారుల సొసైటీలుండగా, వీటిలో మూడు మహిళా సంఘాలు (ఆలంపల్లి, పరిగి, రంగంపల్లి) ఉన్నాయి.
మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది. ఏడేండ్లుగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. చేపల పెంపకం చేపట్టి వాటిని విక్రయించిన మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. ఒక్కో చెరువులో రూ.లక్ష విలువైన చేపపిల్లలను వదలగా, వాటి విక్రయంతో ప్రతి కుటుంబం రూ.3 నుంచి 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ప్రతి ఏటా జిల్లా నుంచి 5వేల టన్నులకుపైగా చేపల దిగుబడి వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఏడేండ్లలో జిల్లావ్యాప్తంగా దాదాపు 700 చెరువుల్లో పెంచిన చేపలతో 31,508 టన్నుల దిగుబడి వచ్చినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మత్స్యకారుల కుటుంబాలు రూ.402 కోట్లకుపైగా లాభాలు ఆర్జించినట్లు సంబంధిత అధికారులు లెక్కలు తేల్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3వేల టన్నుల దిగుబడిరాగా, సంబంధిత చేపల విక్రయాలతో రూ.39 కోట్ల ఆదాయం, 2017-18లో 3500 టన్నుల దిగుబడిరాగా, రూ.45.50కోట్లు, 2018-19లో 4200 టన్నుల దిగుబడిరాగా, రూ.54.60 కోట్లు, 2019-20లో 4585 టన్నుల దిగుబడిరాగా, రూ.59.60కోట్లు, 2020-21లో 5184 టన్నుల దిగుబడిరాగా, రూ.67.39 కోట్లు, 2021-22లో 4920 టన్నుల దిగుబడిరాగా, రూ.67.39 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6119 టన్నుల దిగుబడిరాగా, రూ.75.33 కోట్ల ఆదాయం చేపల విక్రయం ద్వారా మత్స్యకారులు లాభాలను ఆర్జించారు.