సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) ; జీహెచ్ఎంసీపై ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కన్నేశారు. సంస్థకు సంబంధించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్వోబీ)లను గద్దల్లా తన్నుకుపోయేందుకు సిద్ధ్దమయ్యారు. ప్రకటనల రూపంలో రూ. కోట్ల ఆదాయాన్ని అందించే బంగారు బాతులాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అప్పన్నంగా దక్కించుకునేందుకు మాస్టర్ స్కేచ్ వేశారు. ప్రభుత్వంలోని ముఖ్య నేత కార్యాలయం డైరెక్షన్లో వ్యూహరచన చేసి చకచకా అడుగులు వేస్తున్నారు. జీవో నంబర్ 68కి విరుద్ధంగా నిర్వహణ ముసుగులో ఎల్ఈడీ ప్రకటనల పేరుతో సొంత గల్లా పెట్టెను నింపుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో బల్దియా పెద్ద ఒకరు, ‘ముఖ్య’ నేత కోటరీలోని మైనార్టీ నేత చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే ఎల్ఈడీ ప్రకటనలతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక మినహాయింపులు పొందిన యాడ్ ఏజెన్సీలతో గ్రేటర్లోని 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పంచుకునేందుకు లోపాయికారి ఒప్పందంతో ముందుకువెళ్తున్నారు.
10 ఎఫ్వోబీలు కావాలంటూ బల్దియా పెద్ద ఒకరు ప్రతిపాదన పెట్టగా, మైనార్టీ నేత ఐదు, మిగిలిన యాడ్ ఏజెన్సీలు పంచుకునేందుకు అవగాహన కుదిరినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఎఫ్వోబీల నిర్వహణ, జీవో 68 నుంచి మినహాయింపుతో ఎల్ఈడీ ప్రకటనలకు సంబంధించిన దస్ర్తాన్ని ఆగమేఘాల మీద స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకురావడం, అప్పటి వరకు ఏజెండాలో లేని ఈ అంశాన్ని టేబుల్ ఐటెంగా చేర్చి మరీ సభ్యులతో ఆమోద ముద్ర వేయించడం గమనార్హం. ప్రస్తుతం నిర్వహణ పేరిట ప్రైవేట్ పరం చేసే ఎఫ్వోబీల దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. సర్కారు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ముందస్తు అవగాహన ప్రకారం తెరమీదకు టెండర్ల ప్రక్రియ నడిపించి, అస్మదీయులకే ఈ ఎఫ్వోబీలను కట్టబెట్టేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారన్న ప్రచారం జోరుగా వినిపిస్తున్నది. ఆర్థిక కష్టాల్లో ఉన్న బల్దియాలో ఆదాయ మార్గాలను పెంచుతూ, వ్యవస్థాగత బలోపేతానికి కృషి చేయకుండా పప్పు బెల్లం తరహాలో జీహెచ్ఎంసీ ఖజానాను కొల్లగొట్టేందుకు ప్రభుత్వంలోని కొందరు రాజకీయ పెద్దలు సిద్ధం కావడం గమనార్హం.
గ్రేటర్లో పాదచారుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ 72 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను చేపట్టాలని నిర్ణయించి దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందుబాటులోకి వచ్చిన చోట జీహెచ్ఎంసీ నిర్వహణ చేపడుతున్నది. ఏటా ఒక్కో ఎఫ్వోబీకి నిర్వహణ పేరిట దాదాపుగా రూ.12 నుంచి 15 లక్షల మేర ఖర్చు చేస్తున్నది. అయితే నిర్వహణ భారం అవుతున్నప్పుడు జీహెచ్ఎంసీ జీవో నం 68 ప్రకారంగా ప్రకటనలకు అవకాశం కల్పించి ముందుకొచ్చిన ఏజెన్సీల నుంచి ఫీజులను వసూలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ ఘనత వహించిన అధికారులు ఎఫ్వోబీలను ప్రైవేట్ వ్యక్తులు(యాడ్ ఏజెన్సీ)లకు నిర్వహణ పేరిట అప్పన్నంగా కట్టబెడుతున్నారు.
అందులో రెండు విధాలుగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. గ్రేటర్లో ప్రకటన బోర్డు ఎత్తు భూమి నుంచి 15 అడుగుల లోపే ఉండాలనే నిబంధన జీవో నం 68 స్పష్టం చేస్తున్నది. కానీ ఈ 23 ఎఫ్వోబీలకు ఈ జీవో వర్తించదని, ఎత్తు విషయంలో నిబంధన నుంచి మినహాయింపునకు ప్రతిపాదన పెట్టారు. అంతేకాకుండా దాదాపు ఎఫ్వోబీలన్నీ 15 అడుగుల ఎత్తు వరకు ఉండగా, ఆపై ఎల్ఈడీ బోర్డులు దర్శనం ఇవ్వనున్నాయి. మరో ఉల్లంఘన విషయానికొస్తే గ్రేటర్లో ఎల్ఈడీ ప్రకటనలు నిషేధం. అవసరమైతే హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఎల్ఈడీ ప్రకటనలు అనుమతించాలి. కానీ ఇక్కడ ఇవేం నిబంధనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా వెళ్తుండగా, గుడ్డి దర్బార్లా స్టాం డింగ్ కమిటీ సభ్యులు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి చేర్చి న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా స్టాండింగ్ కమిటీలో లేని ఏజెండాను టేబుల్గా ఐటెంగా చేర్చి సుదీర్ఘ చర్చ లేకుండా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం విస్మయం కలిగించే అంశం.
నిర్వహణ ముసుగులో రూ.కోట్ల రాబడికి ప్లాన్
ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వద్ద ఎఫ్వోబీ, ఎంజే మార్కెట్ వద్ద పేరొందిన యాడ్ ఏజెన్సీకి నిర్వహణ ముసుగులో అప్పన్నంగా చదరపు మీటర్కు వార్షికంగా రూ. 5500/- ఫీజును నిర్ణయించి కట్టబెట్టారు. దీంతో ఒక ైస్లెడ్ ప్రకటనకు దాదాపు రూ. 6 లక్షల మేర ఏజెన్సీ వాణిజ్య, వ్యాపార సంస్థల నుంచి వసూలు చేస్తున్నా రు. పది ైస్లెడ్లు, అందులో రెండు వైపులా కలిపి నెలకు దాదాపుగా రూ. కోటి మేర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కానీ బల్దియాకు మాత్రం వార్షికంగా రూ. లక్షల్లో మాత్రమే ఫీజులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలోనే 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు చేరుతున్నాయి. ఈ ఎఫ్వోబీలపై ఎల్ఈడీ స్క్రీన్ రెండు వైపులా ఏర్పాటు చేసుకుని అందినంత దండుకోవచ్చని ప్లాన్కు టెండర్ వేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నం. 68 మార్గదర్శకాలు రెండు యాడ్ ఏజెన్సీలకు మినహాయింపు ఇస్తూ గతేడాది మార్చి 14, 15వ తేదీల్లో అప్పటి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ప్రత్యేకంగా జీవో నంబర్ 156, 143లను జారీ చేశారు. ఈ తరహానే త్వరలో 23 ఎఫ్వోబీలకు సంబంధించి జీవో వెలువడే అవకాశం ఉన్నది.
ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ఎఫ్వోబీలు ఇవే.. దీప్తి
శ్రీనగర్, ఐడీపీఎల్ కాలనీ, మూసాపేట, షాపూర్ నగ ర్, బంజారాహిల్స్ రోడ్ నం 1, పంజాగుట్ట సిగ్నల్, ఈఎస్ఐ దవాఖాన, ఎన్ఎండీసీ, పురపాలక శాఖ కార్యాలయం మాసబ్ట్యాంక్, మల్కంచెరువు, సంగీత్ క్రాస్రోడ్ సెయిం ట్ స్కూల్, తార్నాక సెయింట్ ఆన్ స్కూల్, నేరేడ్మెట్ క్రాస్ రోడ్, బుద్వేల్ రైల్వేస్టేషన్, కాటేదాన్, బాబానగర్, హసన్నగర్(ఎన్పీఏ), ఏఎస్రావునగర్, రంగారెడ్డి కోర్టు కొత్తపేట, రామంతాపూర్, ఎన్టీఆర్గార్డెన్, దిల్సుఖ్నగర్ చందనబ్రదర్స్, జేపీ సీనిమాస్ చందానగర్ ప్రాంతాల్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పనున్నా రు. నిర్వహణ ముసుగులో ప్రకటన దందాకు ఒకరిద్దరి ఏజెన్సీల చేతుల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారనే ఆరోపణ లున్నాయి. కాగా, జీవో 68 నుంచి మినహాయింపు ఇచ్చి తన ఆప్తులను అందలం ఎక్కిస్తూ వస్తున్న తీరును ఈ పరిశ్రమపై ఆధారపడిన 209 ఏజెన్సీల ప్రతినిధులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను హైకోర్టులో తేల్చుకుంటామని, ఈ నెల 6న కోర్టులో మాకు తప్పక న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా..ఫోన్లో ఆయన అందుబాటులోకి రాలేదు.