ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 5: వర్షాలు సమృద్ధిగా కురువడంతో భూగర్భజలాలు పెరిగాయి. దీం తో జిల్లాలోని రైతులు బోరుబావుల కింద పెద్ద ఎత్తున వరిపంటను సాగుచేస్తున్నారు. పంట సాగులో రైతు లు వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎరువులను చల్లి పెట్టుబడి ఖర్చులను పెంచుకుంటున్నారు. వరిసాగులో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడంతోపాటు భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా ఎరువులను వాడినప్పుడే మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. భూసార పరీక్షలు చేయించినప్పుడు ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 నుంచి 16 కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వాడాలి. అంతకుమించి వాడితే వరికి తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ తెలిపారు.
యూరియాను మూడు విడుతలుగా చల్లాలి..
వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలోగానీ, యూరియాగానూ వాడొచ్చు. దీనిని మూడు విడుతలుగా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసేముం దు, దుబ్బు చేసే దశలో.. అంకురం ఏర్పడే దశలో వాడాలి. ఎకరానికి 25 నుంచి 32 కిలోల నత్రజనిని అందించాలంటే 55 నుంచి 70 కిలోల యూరియా ను పొలంలో చల్లాలి. దీనిని మూడు సమాన భాగాలుగా విభజించి చల్లాల్సి ఉంటుంది. పైరు పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకుంటే 10 నుంచి 15 కిలోల వరకు యూరియాను వాడొచ్చు. లేదంటే 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులపాటు నిల్వ ఉంచి చల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. యూరియాను అధికంగా వినియోగించొద్దు.
భాస్వరాన్ని సకాలంలో అందించాలి..
మొక్కల వేర్ల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం దోహదపడుతుంది. దీనిని నాటు వేసే ముందు పొలంలో.. నాట్లు వేసిన 15 రోజుల్లోపు కాంప్లెక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది. యూరియా చల్లిన 48 గంటల తర్వాత తప్పనిసరిగా పంటకు నీటిని అందించాలి. సాధారణంగా జింకు లోపం చలికాలం, చౌడు పొలాలు, మురుగు సమస్య ఉండే పొలాల్లో కనిపిస్తుంది. వరి నాటిన 2 నుంచి 4 వారా ల్లో జింకు లోపం కనిపిస్తుంది. దీని నివారణకు 20 కిలోల జింకు సల్ఫేట్ను ఎకరానికి చివరి దమ్ములో వేయాలి. లేకపోతే 0.2 శాతం జింకు సల్ఫేట్ను నాలుగైదు రోజులకొక్కసారి రెండు, మూడు పర్యాయాలు పైరు ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. దీనిని ఎలాంటి పురుగు, తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయొద్దు.
వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
రైతులు ప్రతిరోజూ తమ పొలాలకెళ్లి పంటల పరిస్థితిని పరిశీలించాలి. అనుమానం వచ్చిన వెంటనే స్థానికంగా రైతువేదిక భవనాల్లో ఉండే అధికారుల ను సంప్రదించి వారి సలహాలు, సూచనలతో మం దులను వాడి సమస్యలను పరిష్కరించుకోవాలి. వరిలో ఇనుము లోపం కూడా రావచ్చు. దాని నివారణకు మూడు గ్రాముల నిమ్మఉప్పు, లీటరు నీటిలో కలిపి పైరు బాగా తడిచేలా పిచికారీ చేయా లి. రైతులు ఎప్పుడూ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. – శ్రావణ్కుమార్,
వ్యవసాయ విస్తరణాధికారి, ఇబ్రహీంపట్నం