మంచాల, డిసెంబర్ 26 : మండలంలోని పలు గ్రామాల్లోని రైతులు ఆరుతడి పంటలైన కూరగాయలు, ఆకుకూరలను సాగుచేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. జాపాల, అస్మత్పూర్, ఆరుట్ల, మంచాల, చెన్నారెడ్డిగూడ తదితర గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూముల్లో వరికి బదులుగా కొత్తిమీర, పుదీ నా, పాలకూర, కొయ్యికూర, గోంగూర, తోటకూర, టమాట, బెండ, చిక్కుడు, బీరకాయ వంటి పంటలను సాగుచేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజల జీవనాధారం వ్యవసాయమే. తక్కువ పెట్టుబడితో అన్నదాతలు తాము సాగు చేసిన ఉత్పత్తులను ఉదయమే తెంపి స్వయంగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, మాదన్నపేట, కొత్తపేట, బీఎన్రెడ్డినగర్ తదితర మార్కెట్లకు తరలించి అక్కడ విక్రయించి లాభాలను పొందుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉండడంతో మార్కెట్లకు తరలించిన కొద్దిసేపట్లోనే అవి అమ్ముపోతుండడంతో తిరిగి తొమ్మిది గంటల వరకు ఇండ్లకు చేరుకుని మళ్లీ వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమవుతున్నారు.
ఆకుకూరల సాగులో గ్రామాలు..
మండలంలోని చాలా గ్రామాల్లోని రైతులు తమకున్న భూముల్లో ఆకుకూరలు, కూరగాయల పంటలను సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. జాపాల, అస్మత్పూర్ గ్రామాల్లో 150 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. ఆరుట్లలో 120 ఎకరాల్లో.. మంచాలలో 130 ఎకరాల్లో కూరగాయలను పండించి ప్రతిరోజూ మార్కెట్లకు అన్నదాతలే ఆటోలు, వాహనాల్లో తీసుకెళ్లి విక్రయించి లాభాలను పొందుతున్నారు. హైదరాబాద్కు జాపాల, అస్మత్పూర్ గ్రామాలు దగ్గరగా ఉండడంతో అక్కడ అమ్మి తిరిగి ఇండ్లకు తొమ్మిది నుంచి పది గంటల మధ్య వస్తున్నారు.
తాజాగా ఉండడంతో తొందరగా అమ్ముడవుతున్నాయి..
ప్రతిరోజూ పొలంలో సాగు చేసిన వివిధ రకాల ఆకుకూరలు, కూర గా యాలను మార్కెట్కు ఆటోలో తీసుకెళ్లి విక్రయిస్తా. అవి తాజాగా ఉండడంతో తీసుకెళ్లిన కొద్దిసేపట్లోనే అమ్ముడవుతున్నాయి. గోంగూర, పూదీనా, పాలకూరతోపాటు కూరగాయలను విక్రయించగా రూ. నాలు గు వేల వరకు వస్తుంది. మళ్లీ ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతా.
-రావుల మల్లమ్మ(ఆరుట్ల)
ఆరుతడి పంటలను సాగు చేయాలి
యాసంగి సీజన్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి. వరికి బదులుగా ఆరుతడి పంటలైన ఆకుకూరలతోపాటు టమాట, చిక్కుడు, సోరకాయ వంటి పం టలను సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. పంటలకు చీడ పురుగులు సోకితే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి తగు నివారణ చర్యలు తీసుకోవాలి.
– జ్యోతిశ్రీ, వ్యవసాయశాఖ అధికారిణి