బొంరాస్పేట, జూలై 3 : వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానకాలంలో పంటలు పండించేందుకు.. విత్తనాలు విత్తే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. మృగశిర కార్తె తర్వాత వానలు కురువకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు ఇటీవల కురుస్తున్న వర్షాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దక్కులు దున్ని సాగుకు సిద్ధంగా ఉంచుకోగా విత్తనాలను విత్తుతున్నారు. జిల్లాలోని మెట్ట భూముల్లో వర్షాధారంగా పత్తి, కంది, మొక్కజొన్న, పెసర.. వ్యవసాయ బోర్లు, చెరువుల కింద ఎక్కువగా వరి పంటను సాగు చేస్తున్నారు. నల్లరేగడి భూముల్లో ఎక్కువగా కంది, పత్తి పంటలను సాగు చేస్తారు. బొంరాస్పేట, దోమ, దౌల్తాబాద్, పరిగి తదితర మండలాల్లో పెసర పంటను ఎక్కువగా సాగు చేస్తారు. మృగశిర కార్తెకు ముందు రోహిణి కార్తెలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేసినా తీవ్రమైన ఎండలకు అవి మొలకెత్తలేదు. అలాంటి వాటిని తొలగించి మళ్లీ వేస్తున్నారు.
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.46 లక్షల ఎకరాలు
వికారాబాద్ జిల్లాలో వానకాల సాధారణ సాగు విస్తీర్ణం 5,46,205 ఎకరాలు. గతేడాది వానకాలంలో 5,81,464 ఎకరాలలో రైతులు పంటలను సాగు చేయగా.. ఈ వానకాలంలో 5,90,308 ఎకరాలలో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 68,789 ఎకరాలలో విత్తనాలు వేశారు. ఈ వానకాలంలో పత్తి 2, 55,980 ఎకరాలలో, కంది 1,60,824, వరి 95,690, మొక్కజొన్న 53,322, జొన్న 2560, పెసర 12690, మినుములు 5252 , సోయాబీన్ 2990 ఎకరాలలో సాగు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
ఫరూఖ్నగర్ మండలంలోని 48 గ్రామ పంచాయతీల్లో ..
కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు వ్య వసాయ పనుల్లో బిజీ అయ్యారు. షాద్నగర్ మున్సిపాలిటీ, ఫరూఖ్నగర్ మండలంలోని కమ్మదనం, కొండన్నగూడ, నాగులపల్లి, చిం చోడు, లింగారెడ్డిగూడ, మధురాపూర్, దూసకల్, గంట్లవెల్లి, సోలీపూర్, దేవునిపల్లి, హాజిపల్లి, కిషన్నగర్, భీమారం, కాశిరెడ్డిగూడ, ఎలికట్ట, మొగిలిగిద్దతోపాటు పలు గ్రామాల్లోని రైతులు పొలాలను వరి సాగుకు సిద్ధం చేసు కోగా.. మరికొందరు పొలా ల్లో విత్తనాలను విత్తుతున్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని 48 గ్రామ పంచాయతీల్లో 24,826 ఎక రాలలో రైతన్నలు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. 13,016 ఎకరాలలో వరి, మొక్కజొన్న 4163, జొన్న 247, పత్తి 1700 , కూర గాయలు 490, కందులు 561, ఉద్యానవన పంటలను 4649 ఎకరా లలో సాగు చేస్తున్నారు. మండలంలోని 25,473 మంది రైతులకు సర్కారు రైతుబంధు పథకం కింద రూ. 22.69 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటు న్నారు. రైతులు విత్తనాలు, ఎరువులను లైసెన్స్ డీల్లర్ల వద్దే కొనాలని, సంబంధిత రసీదులను వెంటనే తీసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
విత్తనాలను విత్తుకునేందుకు సిద్ధంగా ఉండాలి
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు విత్తనాలను విత్తుకునేందుకు సిద్ధంగా ఉండాలి. వరి నార్లు పోసేవారు స్వల్పకాలిక వరి రకాలను ఎంచు కోవాలి. సోయా చిక్కుడును ఈ నెలాఖరు వరకు, పత్తిని జూలై 20వరకు, మొక్కజొన్న, పెసర, మినుములు జూలై 15 వరకు, ఆముదాలు, సన్ప్లవర్, ఉలవలు జూలై 31వరకు, కంది ఆగస్టు 15వరకు సాగు చేసుకోవచ్చు. సాగులో సందేహాలుంటే వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు ఉన్న విత్తనాలు, ఎరువులను మాత్రమే కొనాలి. నకిలీ విత్తనాలు విక్రయిం చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
–నిశాంత్కుమార్, ఫరూఖ్నగర్ మండల వ్యవసాయాధికారి, షాద్నగర్