పూడూరు, జనవరి 6 : రైతులు పండించిన ధాన్యం, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు లేక సంబంధిత అధికారులు, రైతులు పలు ఇబ్బందులు పడేవారు. ప్రతి యేటా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ అధికారులు ప్రాథమిక వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో ఆయా సీజన్లలో పూడూరు, అంగడిచిట్టంపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేవారు. దీంతో ఆయా ప్రాంతాల రైతులు వారికి అనుకూలమైన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, జొన్న, కంది, శనగ తదితర ధాన్యాలను విక్రయానికి తీసుకెళ్లే వారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం గింజలను ఉంచేందుకు గోదాము సౌకర్యం లేక పోవడంతో ఖాళీ స్థలంలో దించేవారు. అకాల వర్షాలు వస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంతో పాటు రైతుల గింజలు తడిస్తే తీవ్రనష్టం జరిగేది.
మన్నెగూడ, అంగడి చిట్టంపల్లిలో..
రైతుల సౌకర్యం కోసం సంఘానికి సంబంధించిన ఖాళీ స్థలాల్లో గోదాముల నిర్మాణ పనులు చేసేందుకు ప్రభుత్వానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా గతేడాది ప్రతి పాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం (నాబార్డు) నుంచి మన్నెగూడ, అంగడి చిట్టంపల్లి గ్రామాల్లో ఉన్న సొసైటీ స్థలాల్లో గోదాముల నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఒక్కో గోదాములో 1500 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచే సామర్థ్యంతో రెండు గోదాములు మంజూరు కాగా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ గోదాముల నిర్మాణం పూర్తయితే రైతులు పండించిన ధాన్యాన్ని సుమారుగా 3వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ ఉంచి సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ప్రభుత్వం మండల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో గోదాముల నిర్మాణం చేయడంతో పలువురు రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలోను మరో గోదాం నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు, అనుమతులు వచ్చిన వెంటనే అక్కడ పనులు ప్రారంభిస్తామని సొసైటీ చైర్మన్ పి.సతీశ్రెడ్డి పేర్కొన్నారు.
మద్దతు ధర వచ్చినప్పుడే విక్రయించుకోవచ్చు..
సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం, రైతులు పండించి తీసుకొచ్చిన గింజలు నిల్వ ఉంచేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రెండు చోట్ల గోదాముల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ గోదాముల నిర్మాణంతో ధాన్యం నిల్వ ఉంచుకొని సరైన మద్దతు ధర వచ్చినప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో మరో గోదాము నిర్మాణం కోసం ప్రతి పాదనలు పంపాము. ఈ గోదాముల నిర్మాణం పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరుగనున్నది.
– పి.సతీశ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, పూడూరు
రైతులకు సౌకర్యంగా ఉంటుంది
రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచే సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లం. ప్రభుత్వం సొసైటీల ద్వారా ఆయా గ్రామాల్లో గోదాములు నిర్మించడం అభినందనీయం. గోదాములను ప్రారంభిస్తే రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ముందుగా రైతులు ధాన్యం అమ్మకాలు చేయకుండా గోదాముల్లో నిల్వ ఉంచుకునే అవకాశం రైతులకు కలుగుతుంది. ఈ గోదాముల నిర్మాణంతో మాకు ఎంతో సంతోషంగా ఉన్నది.
– వడ్ల రాములు, రైతు, పూడూరు