బొంరాస్పేట, ఏప్రిల్ 15 : మండలంలోని ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టు కింద యాసంగిలో వరి పంటలు సాగు చేసుకున్న రైతులు వాటిని కాపాడుకోవడానికి అపసోపాలు పడుతున్నారు. పంటలకు నీరందించడానికి అన్నదాతలు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. కొడంగల్ నియోజవర్గంలో ఏకైక సాగునీటి ప్రాజెక్టుగా పేరుగాంచిన కాకరవాణి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఏటా సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎగువన రైతులు ప్రాజెక్టు లోపలి భాగం నుంచి అక్రమంగా నీటిని తరలించి పంటలను సాగు చేస్తుండడంతో ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసుకున్న రైతులకు అవస్థలు తప్పడం లేదు.
ఏర్పుమళ్ల గ్రామానికి సమీపంలో కాకరవాణి వాగుకు అడ్డంగా 1972లో ప్రాజెక్టు నిర్మించడానికి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు కింద 1260 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిర్మించారు. ప్రతి సంవత్సరం 600 ఎకరాలకు మించి ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. ఏటా ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పారుతున్నా యాసంగిలో రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు ఎగువ భాగంలో రైతులు ప్రాజెక్టులో మోటర్లు పెట్టి పైపుల ద్వారా నీటిని తరలించి ఏటా సుమారు వంద ఎకరాలకు పైగా వరి పంటలను సాగు చేస్తున్నారు.
దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గి ప్రాజెక్టు దిగువన ఉన్న పొలాలకు సాగు నీరు అందడం లేదు. ఈ యాసంగిలో ప్రాజెక్టు కింద రైతులు 200లకుపైగా ఎకరాలలో వరి పంటలను సాగు చేశారు. ప్రాజెక్టు ఎగువన అక్రమంగా నీటిని తరలించుకుపోవడంతో తూముకు నీళ్లు అందక ప్రాజెక్టు కింద పంటలు సాగు చేసిన రైతులు సాగునీరు అందించడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో నీరందే పరిస్థితి లేదు. దీంతో రైతులు మోటర్లు పెట్టి పైపుల ద్వారా ప్రాజెక్టులోని నీటిని తూములోకి తరలించి కాలువ ద్వారా పొలాలకు పారబెడుతున్నారు.
మోటర్లు, పైపుల కోసం ఒక్కో రైతు రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అదనపు భారమైనా పంటలను కాపాడుకోవడానికి వేరే దారి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువన అక్రమ నీటి తరలింపును అరికడితే సాగునీటి ఇబ్బందులు తప్పుతాయని రైతులు భావిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని కాకరవాణి ప్రాజెక్టు రైతుల ఇబ్బందులపై దృష్టిసారించి సాగునీటి ఇబ్బందులు తొలగించాలని రైతులు కోరుతున్నారు.