వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. రైతుల బతుకులను చీకటిలోకి నెట్టినట్టేనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. మూడోరోజు బుధవారం ఉమ్మడి జిల్లాలోని పలు రైతువేదికల్లో సభలు జరిగాయి. వికారాబాద్ నియోజకవర్గం ధారూరు మండలంలో జరిగిన సభల్లో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, నవాబుపేటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు రైతువేదికలో జరిగిన సభలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఉప్పరిగూడలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ నేతలకు కండ్లమండుతున్నాయన్నారు. పంటల సాగుకు 3 గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతలు ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలతో రైతులపై కాంగ్రెస్ వక్రబుద్ధి బయటపడిందన్నారు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ను నమ్ముకుంటే గోస తప్పదన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు. ‘3 పంటలు ముద్దు.. 3 గంటలు వద్దు’ అనే నినాదాలతో రైతు సభలు దద్దరిల్లాయి.
-రంగారెడ్డి , జూలై 19 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడో రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఆనంద్, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, రైతు బంధు సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి ఆధ్వర్యంలో రైతు వేదికల వద్ద సభలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేలా బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను పూర్తిగా రూపుమాపేందుకు నాటి ఉద్యమ రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల విద్యుత్లో అవినీతి ఉందంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్కు ఓట్లేస్తే రాష్ట్రమంతటా చీకట్లు అలుముకుంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ను తరిమికొడదాం.. 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ ఏడాదికి 3 పంటలు పండించేందుకు కృషిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటూ పెద్దఎత్తున రైతులు నినాదాలు చేశారు. 24 గంటల కరెంటు వద్దన్న రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తీర్మానాలు చేశారు.
వికారాబాద్/ధారూరు, జూలై 19 : రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టేలా బుద్ధి చెప్పాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం ధారూరు మండల పరిధిలోని కెరెళ్లి, మున్నూర్ సోమారం, ధారూరు, నాగసముందర్ గ్రామాల రైతు వేదికల్లో రైతు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 20 ఏండ్ల కింద చంద్రబాబునాయుడు వ్యవసాయం దండుగ అన్నారని, ఆయన శిష్యుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రస్తుతం రైతులకు 3 గంటలే కరెంట్ చాలు అని రైతులను చిన్నచూపు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా రేవంత్రెడ్డి మాట్లాడం సరికాదన్నారు. ఆంధ్రాప్రాంతం వారి పెత్తనం మనపై రుద్దవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల కరెంట్ ఇవ్వడం ఖాయమని తెలిపారు. మళ్లీ 60 ఏండ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని, బోరు, బావులకాడ అర్ధరాత్రి పొలాల వద్దకు వెళ్లి నిద్రించే అవకాశాలు ఉన్నాయన్నారు. అప్పట్లో బోరు, బావుల వద్ద ఫీజులు ఎగిరిపోయేవి, పాము కాటుకు రైతులు మృత్యువాత పడటం, విద్యుత్ షాక్తో రైతులు మరణించిన సందర్భాలు చాలా ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడంతో సంవత్సరానికి మూడు పంటలు పండించి రైతులు ఆనందంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చేతనైతే రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ తదితర పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. రైతుల పట్ల చులకనగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇస్తామన్న 3 గంటల కరెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 పంటలకు సరిపడా కరెంట్ ఇస్తుందన్న విషయాన్ని గ్రామాల్లో ప్రజలు చర్చ జరుపాలన్నారు. జన సంచారం ఉన్న చోట, పొలాలవద్ద, హోటళ్ల వద్ద, కలుపుతీసే సమయాల్లో ఈ విషయాలపై చర్చబెట్టి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, జడ్పీటీసీ సుజాతరెడ్డి, మండల అధ్యక్షుడు రాజూనాయక్, ప్రధాన కార్యదర్శులు అంజయ్య, రాజుగుప్తా, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్కుమార్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, రైతు కమిటీ మండల అధ్యక్షుడు లక్ష్మయ్య, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్ చంద్రమౌళి, నాయకులు వేణుగోపాల్రెడ్డి, నరోత్తంరెడ్డి, మోహిద్ఖురేషీ, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 19 : గత సీమాంధ్ర పాలకుల హయాంలో కరెంటు కష్టాలు చెప్పనలవి కావు. రాత్రింబవళ్లు తేడా లేకుండా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి కరెంటుషాకు, పాముకాటు, తేలుకాటుతో పాటు ఇతర ప్రమాదాలకు గురై ఎంతోమంది రైతులు మృత్యువాతకు గురైన సంఘటనలున్నాయని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ రైతు వేదికలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రైతు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రైతు వేదిక ఆవరణలో మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ను తరిమికొడదాం.. 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ ఏడాదికి 3 పంటలు పండించేందుకు కృషిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలను పూర్తిగా రూపుమాపేందుకు నాటి ఉద్యమ రథసారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. దీంతో రాష్ట్రంలో రైతులకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.
వలసలు పోయిన రైతులు ఇప్పుడిప్పుడే తమ స్వగ్రామాలకు చేరుకుని వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ యమపాశంలా ప్రజల మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. 24 గంటల కరెంటు ఇస్తుంటే.. అది చూసి ఓర్వలేని రేవంత్రెడ్డి.. మూడు గంటల కరెంటు చాలు అని చిల్లరగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. రైతుల కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ సంక్షేమం కోసం కరెంటు ఇస్తుంటే.. 24 గంటల కరెంటు అనవసరం.. 3 గంటల కరెంటు సరిపోతుంది అంటూ మాట్లాడటం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజల్లో తిరుగుతారని హేళన చేశారు. రైతుల సంక్షేమానికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీకి చెందిన నాయకులను పాతాళానికి తొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. రైతులతో ఆడుకున్న చంద్రబాబుకు పట్టిన గతి మళ్లీ నీకు పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ ప్రజల్లోకి రానిస్తే పీడించుకుతింటుందని, ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ సర్కారు చల్లని దీవెనతో అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం.. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ పాత రోజులు రావటం ఖాయమని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్లు సుదర్శన్రెడ్డి, మహేందర్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సహకార సంఘం వైస్ చైర్మన్ శంకర్, కౌన్సిలర్ బాలరాజు, ఉప సర్పంచ్ నర్సింహారెడ్డి, నాయకులు గోపాల్, రాంబాబు, శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్, ఆయా గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
షాద్నగర్, జూలై 19 : కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం కొందుర్గులోని రైతు వేదికలో రైతు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలు, రైతుల ఆత్మహత్యలు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు, కాలిన మోటార్లు ఉండేవన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక ఎంతో మంది రైతులు తమ పొలాల వద్దనే పడిగాపులు కాసేవారన్నారు. ఏనాడు కూడా రైతు క్షేమాన్ని పట్టించుకునే పాపాన పోలేదు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రైతు బంధ పథకాన్ని ప్రారంభించి రైతు బాంధవుడయ్యారని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే రైతన్న పంట సాగులో ఎలాంటి ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పంటల సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ రైతులకు కొండంత అండగా నిలిచారన్నారు.
అన్నదాతల క్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని తెలిపారు. నాడు ఎన్నో ఇబ్బందులు పడుతూ పంటలు సాగు చేసిన రైతున్నలు నేడు సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతులకు ఏ చిన్న కష్టం వచ్చినా తామున్నామంటూ భరోసా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నేడు పంటలతో రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడుతున్నదన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల, రైతులు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, వైస్ ఎంపీపీ రాజేష్పటేల్, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, నాయకులు, రైతులున్నారు.
వికారాబాద్/నవాబుపేట, జూలై 19 : తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వద్దు అంటూ తెలంగాణ పీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నవాబుపేట మండలం మీనపల్లికలాన్ క్లస్టర్లో రైతులతో ఎమ్మెల్యే కాలె యాదయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వయంపాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తులో తెలంగాణ దేదీప్యమానంగా వెలుగొందుతుంటే పరాయి పాలకులు, కిరాయి నేతల కళ్లు మండుతున్నాయన్నారు. ఈ వెలుగులను ఆర్పాలని, రైతులను చీకట్లో పాము కాటుకు, కరెంట్ షాక్కు బలి చేయాలని, అధికారం హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ సభలో రాహుల్గాంధీ వెల్లడించిన ప్రకటనలో ఎక్కడా ఉచిత విద్యుత్ ఊసేలేదన్నారు.
మసిబూసి మారెడుకాయ చేసే వాగ్దానాలతో రైతులను ఈజీగా మోసం చేయవచ్చని కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారన్నారు. అనుకోకుండా అమెరికాలో కాంగ్రెస్ రైతు వ్యతిరేక కుట్రలు రేవంత్రెడ్డి రూపంలో బయటపడటంతో తెలంగాణ రైతులు భగ్గుమంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఉచిత కరెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యతిరేక కాంగ్రెస్ నేతలపై రైతులు కదం తొక్కుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. 24 గంటల విద్యుత్లో అవినీతి ఉందంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిత్యం ఆలోచించి తెలంగాణలో రైతును రాజు చేసి, వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్ దేశమంతా జేజేలు పలుకుతుంటే ‘అబ్కి బార్ కిసాన్ సర్కార్’ పేరుతో నడుస్తుంటే కాంగ్రెస్, బీజేపీలు కర్షకుల నోట్లో మట్టి కొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయన్నారు. ఇది గమనించిన తెలంగాణ రైతాంగం ఖండిస్తూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, సర్పంచులు రత్నం, మాణిక్రెడ్డి, సీనియర్ నేతలు ప్రకాశం, కందయ్య ఉన్నారు
ప్రతిరోజూ కరెంటు కోసం పడిగాపులు కాసేవాళ్లం : మొద్దు అంజిరెడ్డి, రైతు
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ మోటార్ల వద్ద కరెంటు కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాసేటోళ్లం. కాని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని దీవెనతో ఎప్పుడు స్టార్టర్ ఆన్ చేసినా మోటర్ పోస్తూనే ఉంది. రైతులు చల్లగా బతుకుతుంటే ఓర్వలేని కాంగ్రెసోళ్లు ఇష్టానుసారంగా మాట్లాడటం సిగ్గుచేటు. నాడు కరెంటు సక్రమంగా ఇవ్వటానికి చేతకాలేదు. నేడు కేసీఆర్ ఇస్తుంటే ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటది.
కాంగ్రెస్ పార్టీతో ఒరిగిందేమీలేదు : కృపేశ్, ఎంపీపీ, ఇబ్రహీంపట్నం
కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్ల పాలనలో రాష్ర్టానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. ప్రత్యేక రాష్ట్రంలో కరెంటు కష్టాలు పూర్తిగా తొలిగిపోయి రైతులు సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో రూ.56 కోట్లతో 23 కొత్త సబ్స్టేషన్లు, రూ.1748 కోట్లతో 1200 ట్రాన్స్ఫార్మర్లను ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో అందజేసి లోవోల్టేజీ సమస్యలు లేకుండా పరిష్కరించిన గొప్ప ప్రభుత్వం బీఆర్ఎస్. రైతుల కష్టాలు ఓవైపు ముఖ్యమంత్రి తీరుస్తుంటే.. మళ్లీ వాళ్లని కష్టాల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇలాంటి కల్లబొల్లి కాంగ్రెస్ను మళ్లీ ప్రజల్లో తిరుగనీయకుండా తరిమికొట్టాలి.
కాంగ్రెస్ ఓట్ల కోసం డ్రామాలు చేస్తున్నది : శ్రీనివాస్, రైతు, మీనపల్లికలాన్
మా గ్రామంలో కరెంట్తోని ఎలాంటి ఇబ్బందిలేదు. మోటర్లకు మీటర్లు అని బీజేపీ, మూడు గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ అంటున్నది. ఇది సరైన పద్ధతి కాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే రాష్ట్రాన్ని సాధించి రైతుల కోసం ఉచిత కరెంట్ ఇవ్వడంలో తప్పులేదు. రాజకీయం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఉంటే అన్నం పెట్టే రైతులే దొరికారా అన్నారు. గుంట భూమి ఉన్న కూడా ఆ రైతు మృతి చెందితే ఐదు లక్షల రైతు బీమా ఇస్తున్న రాష్ర్టం దేశంలో ఎక్కడా లేదు. రాజకీయం చేయాలని అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రైతులకు ఉచితంగా అందజేస్తున్న కరెంట్ జోలికి రావొద్దని నేతలను వేడుకుంటున్నా.
24 గంటల కరెంట్తోనే వ్యవసాయం సాధ్యం
– చిన్నయ్యగౌడ్, రైతు, ధారూరు
గతంలో 3 గంటల కరెంటును కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది. దీంతో వ్యవసాయం చేసుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్తో మూడు పంటలు సాగు చేసుకుంటున్నాం. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ చాలనడం సరైన పద్ధతి కాదు. వ్యవసాయంపై ఆయనకు సరైన అవగాహన లేదు. పదవి కోసం చూస్తున్నారే తప్పా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.