ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 12 : రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం మండలంలోని శేరిగూడ గ్రామానికి చెందిన మొద్దు అంజిరెడ్డి కూరగాయల సాగులో మంచి దిట్ట, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడిస్తూ ఈ ప్రాంత రైతులకు ఆయన ఆదర్శంగా నిలిచారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడిస్తున్నందున రైతు అంజిరెడ్డికి రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డును కూడా అందుకున్నారు. కూరగాయల సాగులో అనేక ప్రయోగాలు చేస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్న అంజిరెడ్డి ఈ ప్రాంత రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అంజిరెడ్డికి వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. తన పొలంలో రకరకాల కూరగాయలు, ఆముదం, పత్తి వంటి పంటలు వేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడిస్తూ మండల, జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. కూరగాయల సాగుతో పాటు పత్తి, మొక్కజొన్న, ఆముదం పంటల్లో కూడా ఆయనది అందెవేసిన చేయి. ఆయన పండించే పంటలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. తనకున్న పొలంలో వరితో పాటు కూరగాయలు సాగుచేస్తుంటారు. కూరగాయల సాగులో ఎక్కువగా పందిరిసాగును ఎంచుకుంటున్నారు. ప్రతియేటా ఆయన బీరకాయ తోటను సాగుచేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
బీరకాయలకు భలే క్రేజ్..
శేరిగూడ గ్రామంలో అంజిరెడ్డి ప్రభుత్వ రాయితీతో గతంలో పందిరి సాగుకు రుణం తీసుకున్నారు. ఎకరా పందిరి సాగుకు రెండులక్షలు ఖర్చు అవుతుండటంతో ఆయనకు ప్రభుత్వం లక్ష రూపాయల సబ్సిడీ అందజేసింది. ఆయన లక్షరూపాయలను వెచ్చించి ఎకరంలో పందిరి సాగు కోసం అవసరమైన కడీలు, పందిరి ఏర్పాటు చేశారు. ఈ ఎకరంలో ఆయన ప్రతియేటా బీరకాయ తోటను సాగుచేస్తున్నారు. సానియా-4రకం బీరకాయలను సాగు చేశారు. ఇందుకు గానూ డ్రిప్పు, మల్చింగ్ సిస్టాన్ని ఆయన వినియోగిస్తున్నారు. పంటలో కలుపు రాకుండా మల్చింగ్ పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో కలుపు రాకపోగా తక్కువ నీటితో ఈ పంటను సాగుచేస్తున్నారు.
ఒక్కసారి వేసిన పందిరి అనేక పంటలకు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఆయన ప్రతి సంవత్సరం ఒక ఎకరంలో బీరను సాగుచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఎకరంలో ఆయన బీర పంటను సాగుచేశారు. ఇందుకు గానూ ఆయనకు సుమారు ఇరవై నుంచి ముప్పైవేల రూపాయల ఖర్చుమాత్రమే వచ్చింది. కాని, ఈ పంట మీద అతను రూ.2లక్షలకు పైగా ఆదాయం వస్తుందని రైతు అంజిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా హైబ్రీడ్ రకం బీరతోటను వేయడం వలన కాయకూడా బాగా ఏపుగా వస్తుందని, దీంతో మార్కెట్లో ఈ రకం బీరకాయలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన తెలిపారు.
సాగుకోసం అయిన ఖర్చు..
గతంలో ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన పందిరిలోనే ఆయన బీరతోటను సాగుచేశారు. ఎకరం బీరసాగు కోసం ఆయన వెచ్చించిన ఖర్చు చాలా తక్కువ. బీర విత్తనాల కోసం రూ.1800, కలుపు రాకుండా ఉండటం కోసం మల్చింగ్కు రూ.15వేలు, డ్రిప్పుకు రూ.15వేలు, చీడపీడల నివారణ కోసం వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యింది. మొత్తం కలిపి ముప్పైరెండువేలు ఖర్చు కాగా ఎకరం బీరసాగుపై సుమారు లక్షా యాభైవేల వరకు ఆదాయం వస్తుందని అంజిరెడ్డి తెలిపారు.
మార్కెట్లో డిమాండ్..
రెండురోజులకోసారి బీరకాయలను కోసి మార్కెట్కు తరలిస్తున్నారు. బీరకాయలు ఎక్కువ కాత వస్తుండటంతో వాటిని ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్కు తరలిస్తున్నారు. తక్కువ బీరకాయలు వచ్చినప్పుడు ఇబ్రహీంపట్నం కూరగాయల మార్కెట్కు తీసుకువస్తుంటారు. దీంతో ఆయనకు రెండురోజులకోసారి నాలుగు నుంచి ఐదువేల వరకు బీరకాయల మీద దిగుబడి వస్తుంది. ముఖ్యంగా అంజిరెడ్డి కూరగాయల సాగులో ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు తాను పండించిన కూరగాయలను ఆయనే స్వయంగా మార్కెట్కు తరలిస్తున్నారు. హైబ్రీడ్ రకం బీరకాయలను మార్కెట్కు తరలిస్తుండటంతో ఆశించిన మేరకు ధర కూడా వస్తుంది.