షాబాద్, మే 5 : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,598 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 629 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 642 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
42 కేంద్రాల్లో..
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో కంటి వెలుగు వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్ల్లద్దాలు పంపిణీ చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 4,905 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 453 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 545 మందికి అద్దాల కోసం ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకు 406 గ్రామాలు, 78 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
పేదల కండ్లల్లో వెలుగు నింపడానికి సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రవేశపెట్టారు. ఆయనకు మా ధన్యవాదాలు. ఇదివరకు కంటి సమస్యలు ఉంటే దూరం వెళ్లి చూపించుకునే వాళ్లం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– ఎండీ మొయినుద్దీన్, మొండివాగు గ్రామం, చేవెళ్ల మండలం