షాబాద్, ఫిబ్రవరి 1 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహించే కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 13,480 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న కంటి వెలుగు క్యాంపులను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు. ప్రజలకు పకడ్బందీగా పరీక్షలు చేయాలని సూచిస్తున్నారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు ప్రతిరోజూ కంటి వెలుగు క్యాంపులను పర్యవేక్షించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 13,480 మందికి కంటి పరీక్షలు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,480 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,846 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 2,381 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. ఆయా మండలాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాలను జిల్లా, డివిజన్ స్థాయి ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచిస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 6042 మందికి కంటి పరీక్షలు
వికారాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. కంటి వెలుగుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలు ఉత్సాహంగా శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. బుధవారం జిల్లాలో 6042 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 951 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 618 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు.